అమెరికాపై కరోనా దెబ్బ: నలుగురిలో ఒకరి ఉద్యోగం ఊడింది, 4 కోట్ల మంది నిరుద్యోగ భృతి
వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీయడంతోపాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. చాలా దేశాలు కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అగ్ర రాజ్యంగా కొనసాగుతున్న అమెరికాపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది.
4 కోట్లకు పైగా నిరుద్యోగ దరఖాస్తులు..
కరోనా షట్డౌన్ తర్వాత అమెరికాలో ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ.. అనేక కంపెనీలు, సంస్థలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి. దీంతో గతవారం దాదాపు 21 లక్షల మంది కొత్తగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని యూఎస్ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 4.1 కోట్లకు చేరింది.
మహా మాంద్యం తర్వాత ఇదే...
ఏప్రిల్లో అమెరికాలో నిరుద్యోగి రేటు 14.7 శాతానికి చేరింది. మహా మాంద్యం తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. అంతేగాక, మే నెలలో ఇది 20 శాతం వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ మరో కీలక విషయాన్ని వెల్లడించింది. వైరస్ విజృంభణ తీవ్రస్తాయిలో ఉన్న సమయంలో 2.5 కోట్ల మంది నిరుద్యోగ భృతి పొందారని, ఇది ప్రస్తుతం 2.1 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే కంపెనీలు తెరుచుకున్న తర్వాత ఉద్యోగులను తిరిగి నియమించుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో కరోనాకు లక్ష మంది బలి..
కాగా, ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలా మంది తిరిగి కంపెనీలకు రాకపోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రెండంకెల ఉద్యోగిత రేటు 2021లోనూ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికీ కూడా పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. అయితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదురుకుంటూ ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఇప్పటి వరకు అమెరికాలో లక్ష మందికిపైగా కరోనాతో మరణించారు. 15 లక్షలకుపైగా కరోనా బారినపడ్డారు. మూడు లక్షల మందికిపైగా కోలుకున్నారు.