చైనా దురాగతం: ప్రజాస్వామ్యం కావాలన్నందుకు.. పది వేల మందిని చంపేశారు!
చైనాలోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం ఇటీవల సంచలన విషయాలను వెల్లడించింది.
బీజింగ్: చైనాలోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం ఇటీవల సంచలన విషయాలను వెల్లడించింది.
తమకు ప్రజాస్వామ్యం కావాలంటూ 1989 జూన్ నెలలో తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 10 వేలమందిని చైనా సైన్యం చంపేసిందట. ''ఆనాడు జరిగిన ఉద్యమంలో కనీసం 10,000 మందిని చంపేసినట్లు అంచనా..'' అని చైనాలో బ్రిటన్ రాయబారి అలాన్ డోనాల్డ్ లండన్కు ఆనాడు పంపిన టెలిగ్రాంలో పేర్కొన్నారు.
ఆ విషయానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చింది. చైనాలో కమ్యునిస్టు ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమకు మిగతా దేశాల మాదిరిగా ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటూ దాదాపు ఏడు వారాలపాటు పౌరులు వీధుల్లోకి వచ్చి పోరాడారు.
1989 మే నెల నుంచే ఈ పోరాటం ప్రారంభమైంది. అయితే, జూన్ 5న వారంతా తియాన్మెన్ స్క్వేర్ వద్దకు చేరుకొని ఉద్యమించగా వారిపై చైనా సైన్యం కాల్పులు జరిపింది.
అప్పట్లో ఆ ఘటనలో ఒక వెయ్యిమంది చనిపోయారంటూ చైనా ప్రపంచాన్ని నమ్మించింది. అయితే, అది నిజం కాదని, అందుకు పదిరెట్ల మందిని చంపేసినట్లు నాటి బ్రిటన్ రాయబారి టెలిగ్రాం ద్వారా తాజాగా తెలిసింది.