కరోనా జననం డిసెంబర్ 31 మధ్యాహ్నం 1:38: ప్రపంచాన్ని బంధించిన వందరోజులు: షాకింగ్ ట్విస్టులు
బీజింగ్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ జన్మించి వందరోజులు దాటింది. డిసెంబర్ 31వ తేదీన.. మధ్యాహ్నం 1:38 నిమిషాలకు ఈ వైరస్ గురించి తొలిసారిగా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది చైనా. హ్యూబే ప్రావిన్స్లోని వుహాన్లో న్యుమోనియా తరహా సరికొత్త అనారోగ్యాన్ని గుర్తించామని, దీనికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదని అంటూ చైనా అధికారిక వెబ్సైట్ డిసెంబర్ 31వ తేదీన మధ్యాహ్నం 1:48 నిమిషాలకు ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి ఆరంభం అదే.
జనవరి 9.. వుహాన్ ఫిష్ మార్కెట్ క్లోజ్..
ఈ వైరస్ జన్మించినట్లు నాలుగు రోజుల తరువాత గుర్తించింది. కరోనా వైరస్ వల్ల ఈ న్యుమోనియా తరహా అనారోగ్యం ఏర్పడుతోందని, ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు గ్రహించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా వుహాన్లోని ఫిష్ మార్కెట్ను మూసివేసింది. ఒకరి నుంచి మరొకరికి సోకుతున్న నేపథ్యంలో.. రద్దీ ప్రాంతాలన్నింటినీ మూసివేసింది. అనంతరం రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. తొలుత- వుహాన్, అనంతరం హ్యూబే ప్రావిన్స్లో రవాణాను నిలిపివేశారు.
మనిషి నుంచి మనిషికి
ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతున్నట్లు గుర్తించారు అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన 20వ రోజు దీన్ని గమనించారు. ఝాంగ్ నాన్షాన్ అనే రెస్పిరేటరీ నిపుణుడు ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. వుహాన్తో ఎలాంటి సంబంధం లేని గ్వాంగ్డాాంగ్ ప్రావిన్స్లో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకరి నుంచి మరొకరికి సోకడం వల్లే ఈ వైరస్ గ్వాంగ్డాంగ్ వరకూ విస్తరించిందని గుర్తించారు. మరో రెండురోజుల వ్యవధిలో షాంఘై, బీజింగ్లల్లో వైరస్ లక్షణాలు వెలుగు చూశాయి. వారం రోజులు గడిచేసరికి జపాన్, దక్షిణ కొరియా, అమెరికాల్లో వైరస్ జాడలు కనిపించాయి.
యూరప్కు విస్తరించిన వైరస్..
తదనంతరం కరోనా వైరస్ కట్టుతప్పింది. చైనాను దాటుకుంది. జనవరి 24వ తేదీ నాటికి యూరప్లో ప్రవేశించింది. ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ వంటి దేశాలను చుట్టుముట్టిందీ వైరస్. వుహాన్లో అప్పటికే 25 మందిని పొట్టనబెట్టుకున్న వైరస్.. స్వదేశానికి చేరుకున్న ఐరోపావాసుల వల్ల ఆయా దేశాలకు వ్యాపించినట్లు గుర్తించారు. భారత్ సహా అన్ని దేశాలు కూడా చైనాకు విమాన సర్వీసులను నిలిపివేయడం ఆరంభించాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్వస్థలాలకు చేరుకున్న వారు అనారోగ్యానికి గురికావడం, సరైన సన్నద్ధత లేకపోవడం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందడం వెంటవెంటనే చోటు చేసుకున్నాయి.
తొలి 50 రోజుల్లో 65 వేల పాజిటివ్ కేసులు..
వైరస్ పుట్టుకను గుర్తించిన తరువాత తొలి 50వ రోజుల్లో వెలుగు చూసిన కేసులు 65 వేలే. ఆ తరువాత 50 రోజుల్లో ఈ సంఖ్య 16 లక్షలను దాటుకుందంటే.. అది ఎంత వేగంగా విస్తరించిందో అంచనా వేసుకోవచ్చు. 16 లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులతో ప్రపంచదేశాలు అల్లాడిపోతున్నాయి. 95 వేల మంది ఈ వైరస్కు బలి అయ్యారు. అభివృద్ధి చెందిన, వైద్య రంగంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న దేశాలు కరోనా వైరస్ ధాటికి వణికిపోతున్నాయి.
83 రోజుల తరువాత లాక్డౌన్..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ను మహమ్మారిగా గుర్తించింది. అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. వైరస్ విధ్వంసాన్ని గుర్తించడంలో జాప్యం చేసిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. ఆయా దేశాల్లో లక్ష నుంచి లక్షన్నర వరకు చొప్పున వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో 18 వేలు, అమెరికాలో 16 వేలు, స్పెయిన్లో 15 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి మరణించారు.
Recommended Video