ఒక్కరోజులోనే వందమంది ఉగ్రవాదుల హతం...!
ఆఫ్గానిస్థాన్లో నిత్యం భద్రతాదళాలకు , మిలిటెంట్లకు మధ్య కాల్పులు జరగడం, దేశంలో ఎక్కడో ఓ చోట హింసాత్మక సంఘటనల్లో పదుల సంఖ్యలో మిలిటెంట్లు, భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణం, ఇయితే రెండు రోజుల నుండి ఆఫ్గాన్ ప్రభుత్వం మిలిటెంట్ల ఏరివేతకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో వందమందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఆ దేశ రక్షణ బలగాలు ప్రకటించాయి.
ఆఫ్గాన్లో ఇటివల జరిగిన ఎన్నికల పరిణామాల తర్వాత అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదుల పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్గాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. దీంతో ఆఫ్గానిస్థాన్లోని మొత్తం 15 ప్రావిన్స్లలో 18 ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టినట్టు ఆ దేశ రక్షణ శాఖ అధికారిక ప్రకటనను వెలువరించింది. ఈ ప్రత్యేక ఆపరేషన్లలో 109 మంది ఉగ్రవాదులను హతం చేసినట్టు పేర్కొన్నారు. వీరితో పాటు మరో45 మంది ఉగ్రవాదులు కూడ గాయపడ్డట్టు తెలిపారు. మరోవైపు కీలక నాయకులను కూడ అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
ముఖ్యంగా దేశంలోని కపీసా, ఆఘా ప్రావిన్స్లలో జరిపిన దాడుల్లో ఉగ్రవాదుల ఆయుధాల గోదాంలతో పాటు ఉగ్రవాద శిబిరాలను కూడ మట్టుపెట్టినట్టు ప్రకటించారు. కాగా ఈ ప్రత్యేక ఆపరేషన్ను ఇరవైనాలుగు గంటలపాటు మాత్రమే జరిపినట్టు ప్రకటించారు.