మక్కాలో ఘోర ప్రమాదం: 107 మంది మృతి
దుబాయ్: హజ్ యాత్ర సందర్భంగా మక్కా మసీదులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ముస్లింలకు పరమ పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదు (గ్రాండ్ మాస్క్)లో భారీ క్రేన్ కూలిపోవడంతో 107 మంది మరణించారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోయింది.
మసీదు పైభాగాన్ని చీల్చుకుంటూ క్రేన్ నేలకొరిగింది. క్రేన్ విరుచుకుపడటంతో మసీదు పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. క్రేన్ భాగాలు పైనుంచి కిందికి వేలాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ట్విట్టర్లో షేర్ అవుతున్నాయి. సహాయ సిబ్బంది, వైద్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లారు.
ఈ నెల 21వ తేదీ నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్సహా అనేక దేశాలకు చెందిన వేలాదిమంది ముస్లింలు దీనికోసం సౌదీ చేరుకున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే యాత్రికుల కోసం సౌదీ ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఏకకాలంలో 22 లక్షల మంది ప్రార్థనలు చేసేందుకు వీలుగా మసీదు విస్తీర్ణాన్ని 4 లక్షల చదరపు మీటర్లకు విస్తరిస్తోంది.
దీనికోసం కొన్నాళ్లుగా భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో నిర్మాణ క్రేన్లను ఏర్పాటు చేసి పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే సౌదీ చేరుకున్న యాత్రికులు శుక్రవారం ప్రార్థనల కోసం పెద్దసంఖ్యలో మక్కా మసీదుకు చేరుకున్నారు. ఈ సమయంలోనే పెను ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల్లోనూ ఎక్కువ మంది హజ్ యాత్రికులేనని తెలుస్తోంది.
ముగ్గురు హైదరాబాదీలకు గాయాలు
సౌదీ అరేబియాలోని మక్కా మసీదు ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు గాయపడ్డారు. వారిలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు హజ్ యాత్రికులు ఉన్నారు. పాతబస్తీ భవానీనగర్కు చెందిన షేక్ ముజీబ్, బజార్ఘాట్కు చెందిన అనీఫ్ దంపతులకు గాయాలయ్యాయని తెలంగాణ హజ్ కమిటీ అధికారులు తెలిపారు.