అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్, మరో నలుగురు విదేశీయులు కూడా
వాషింగ్టన్: అమెరికాలో 15 మంది విదేశీయులను ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి. వీరిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
బోస్టన్, వాషింగ్టన్, హూస్టన్, నెవార్క్, నాష్విల్లే, పిట్స్బర్గ్ ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీంరతా 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్'(ఓపీటీ)అనే వెసులుబాటుని ఉపయోగించుకుని అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అధికారులు ఆరోపించారు.
కాగా, విద్యార్థులు చదివిన రంగంలో ఒక ఏడాదిపాటు పనిచేసే అవకాశం ఓపీటీ కల్పిస్తుంది. స్టెమ్ ఓపీటీలో పాల్గొన్నట్లయితే మరో 24 నెలలపాటు పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అరెస్టైనవారిలో భారతీయ విద్యార్థులతోపాటు లిబియాకు చెందిన ఇద్దరు, సెనెగల్ దేశానికి చెందిన ఒకరు, బంగ్లాదేశ్కు చెందిన మరొకరు ఉన్నారు. కాగా, ఈ విద్యార్థులంతా ఉనికిలోలేని కంపెనీలలో పనిచేస్తున్నట్లు మోసగించారని ఐసీఈ వెల్లడించింది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసలకు సంబంధించిన చట్టాలను మరింత కఠిన తరం చేసిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అనేక మంది అమెరికన్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ఈ నేపథ్యంలోనే వలసలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక, జాతీయ భద్రతలో భాగంగా కూడా వీసాల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నలు వెల్లడించారు.