వ్యాన్ను ఢీకొన్న రైలు: 11మంది మృతి
కరాచీ: పాకిస్థాన్లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ దాటుతున్న వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో 11 మంది మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ అల్లాహ్ డినో సాంద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ను దాటుతుండగా.. కరాచీ నుంచి ముల్తాన్ వెళ్తున్న బాబా ఫరీద్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది.
రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8మంది సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
సైనిక హెలికాప్టర్ కూలి ముగ్గురి మృతి
దక్షిణకొరియాలో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. బెల్ యూహెచ్-1హెచ్ ఇరోక్వాయిస్ హెలికాప్టర్లో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
నలుగురు సిబ్బందితో ఆ హెలికాప్టర్ సోమవారం ఉదయం చున్చుయాన్లో కుప్పకూలింది. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.