ఇటలీలో ఢీకొన్న రెండు రైళ్లు: 12 మంది మృతి
మిలాన్: దక్షిణ ఇటలీలోని పుగ్లియాలో రెండు రైళ్లు ఢీకొట్టుకుని ఘోరప్రమాదం జరిగింది. మంగళవారంనాడు ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న దుర్ఘటనలో 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
బారి నగర సమీపంలో ఒకే ట్రాక్పై రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి రిక్కార్డో జింగ్రో చెప్పారు. పలు బోగీలు పట్టాలు తప్పడం, అవి దెబ్బతినడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవల విభాగం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బోగీల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు.
Scontro frontale tra due treni in #Puglia Comandante VVFF "Ci sono molti morti" LA FOTO https://t.co/UAMLIYlsRg pic.twitter.com/5TOGWbcDE3
— Agenzia ANSA (@Agenzia_Ansa) July 12, 2016
ప్రాణాపాయంలో ఉన్న ఒక చిన్నారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. సహాయకచర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు వాతావరణ పరిస్థితి అనుకూలంగానే ఉందని చెబుతున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మాట్టయే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదొక విషాద ఘట్టమని అన్నారు.
ప్రస్తుతం మిలన్ పర్యటనలో ఉన్న మాట్టాయే వెంటనే రోమ్ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ట్రాక్పై ప్రతిరోజూ సుమారు 200 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ప్రమాదానంతరం డబుల్ ట్రాక్ ఏర్పాటును అత్యవసర ప్రాతిపదికపై చేపట్టారు.