ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది వలస కూలీల మృతి.. 22 మందికి గాయాలు..
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది పురుషులు కాగా, ఒక మహిళ ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సౌత్ నేపాల్లోని బంకె జిల్లా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది.
లాక్ డౌన్ కారణంగా నేపాల్కి చెందిన కొంతమంది వలస కూలీలు ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లాలో చిక్కుకుపోయారు. అక్కడి ప్రభుత్వ చొరవతో ఆదివారం వారందరినీ నేపాల్కు తరలించే ఏర్పాట్లు చేశారు. వీరంతా బస్సులో నేపాల్ బయలుదేరగా... మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం కబళించింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను నేపాల్గంజ్లోని భేరీ ఆసుపత్రికి తరలించారు.విషమంగా ఉన్నవారిని అక్కడినుంచి మరో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనపై స్థానిక ఇన్స్పెక్టర్ హృదయేష్ మాట్లాడుతూ.. అతివేగం కారణంగానే బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టినట్టుగా భావిస్తున్నామన్నారు.బంకె జిల్లా అధికారి రామ్ బహదూర్ మాట్లాడుతూ.. 'ఆ వలస కూలీలంతా భారత్ నుంచి నేపాల్లోని స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులతో పాటు క్షతగాత్రులను భేరీ ఆసుపత్రికి తరలించాం.' తెలిపారు.