కేరళ వరదలకు 12ఏళ్ల బాలిక రూ.19 లక్షల బంగారు కేక్ విరాళం, గతంలోనూ..
దుబాయ్: ఇటీవల ఓ బాలిక తాను సైకిల్ కోసం దాచుకున్న రూ.9వేలను కేరళ వరద బాధితులకు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, దుబాయ్లో ఉంటున్న ఓ 12 ఏళ్ల బాలిక 19 లక్షల విలువైన తన బర్త్ డే గోల్డ్ కేక్ను విరాళంగా ఇచ్చింది.
సైకిల్ కోసం దాచుకున్న రూ.9వేలు వరద బాధితులకు, చిన్నారికి హీరో కంపెనీ బంపరాఫర్
కేరళను వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవిదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
తనకు తోచిన సాయం చేయాలనుకుంది
ఆ అమ్మాయి పేరు ప్రణతి వివేక్. అరకిలో బంగారు కేక్ను ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. కేరళలోని కన్నూర్కు చెందిన వివేక్ దుబాయ్లో వ్యాపారం చేస్తున్నాడు. వారి కుటుంబం అక్కడే స్థిరపడింది. అతని కూతురు ప్రణతి. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం వార్తలలో చూసిన ప్రణతి వారికి తనకు తోచినంత సాయం చేయాలనుకుంది.
కేరళ వార్తలు చూసి చలించిపోయిన ప్రణతి
సోమవారం ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా తండ్రి రూ.19 లక్షల విలువైన బంగార్ కేక్ను ఆర్డర్ చేశాడు. కానీ ప్రణతి దానిని అమ్మి వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చింది. దీనిపై తండ్రి మాట్లాడుతూ... కేరళ వరదల గురించి తన కూతురు వార్తల్లో చూసిందని, దుస్తులు, ఇతర అత్యవసర వస్తువులు ఇచ్చి సాయం చేద్దామని తనతో చెప్పిందని, అందుకు తాను సరేనని చెప్పానని, వెంటనే తన కోసం తెప్పించిన బంగారు కేక్ను తీసుకొచ్చి దానిని అమ్మి వచ్చిన డబ్బును విరాళంగా ఇవ్వాలని తనకు చెప్పిందని, తన కూతురు మంచి మనసును చూసి తాను చలించిపోయానని, తన కోరిక ప్రకారమే దుబాయ్లోని మాతృభూమి సంస్థకు ఆ కేక్ ద్వారా వచ్చిన డబ్బును ఇచ్చానని వివేక్ తెలిపారు.
ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయింది
ఈ డబ్బును కేరళ వరదల కోసం ఇచ్చిన తర్వాతే తన కూతురు ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయిందని తండ్రి వివేక్ తెలిపారు. ప్రణతి ఇలా సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో వివేక్ తన ఫ్యామిలీతో కలిసి కంచి కామకోటి ట్రస్ట్కు వెళ్లారు. అక్కడ ఓ పదిహేనేళ్ల ఏళ్ల బాలిక ఆసుపత్రి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుంటే తన తండ్రి వద్ద డబ్బు తీసుకుని ఆమెకు సాయం చేసింది. ఆ బాలిక సర్జరీకి కావాల్సిన రూ.3 లక్షలు కూడా వివేక్ ఇచ్చారు.
పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసేలా
దాదాపు రెండేళ్ల క్రితం వివేక్ కాలికట్లో తన కుమార్తె చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు. అక్కడ ప్రత్యేక అవసరాలున్న పిల్లలు బస్సు ఎక్కేందుకు నడిచి వెళ్లడానికి ఇబ్బంది పడటం ప్రణతి చూసింది. దాంతో తన తండ్రికి చెప్పి నాలుగు సెంట్ల భూమి కొని అక్కడే స్కూల్ పక్కన పార్కింగ్ స్థలం నిర్మించేలా చేసింది.