మానవ తప్పిదానికి మెక్సికోలో 124 మొసళ్లు మృతి
న్యూఢిల్లీ: మానవ తప్పిదం కారణంగా మెక్సికోలో 124 మొసళ్లు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే... 350 మొసళ్లను ఓ ట్రక్కులో తరలిస్తుండగా అవి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కరేబియన్ తీరానికి చెందిన క్రోకోడ్రిలోస్ ఎక్సోటికోస్ అనే కంపెనీ ఈ మొసళ్లను తరలిస్తోంది.
సినలోవా నుంచి చెటుమాల్ పట్టణానికి మొసళ్లను తరలించే క్రమంలో ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 2550 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మెక్సికోలోని పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వైపు సుమారు 350 మొసళ్లతో ఈ ట్రక్కు బయల్దేరింది.
అంత దూరం సరైన రీతిలో మొసళ్లను తరలించకపోవం వల్లే మొసళ్లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కంపెనీపై పర్యావరణశాఖ వన్యప్రాణి చట్టం ప్రకారం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. మొసలి సంరక్షణ కేంద్రానికి సుమారు 5000 మొసళ్లను తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.