అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడో.. అలబామా అతలాకుతలం.. 14 మంది మృతి
అలబామా : అమెరికాలో టోర్నడో విరుచుకుపడింది. అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. టోర్నడో భీభత్సానికి 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా.. వందలాది సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. సౌత్ ఈస్ట్ అలబామాలో టోర్నడో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఇళ్లు నేలకూలడంతో చాలామంది గల్లంతయ్యారు. ఎమర్జెన్సీ స్క్వాడ్ రంగంలోకి దిగింది. సహాయకచర్యలు ముమ్మరం చేస్తూనే.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చాలా ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకమేర్పడినట్లు సమాచారం. చెట్లు నేలకూలి రహదారులపై పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం నాడు కూడా మరో టోర్నడో వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో అలబామా ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా ఏరియాల్లో టోర్నడో ఏర్పడే ఛాన్సుందని హెచ్చరికలు జారీ చేశారు.