మనీలా పోర్టు వద్ద అగ్ని ప్రమాదం: వీధిన పడ్డ 15 వేల మంది (వీడియో)
ఫిలిప్పీన్స్లో రాజధాని నగరం మనీలా పోర్టుకు సమీపాన గల మలబాన్ పట్టణంలోని రెండు మురికివాడల మధ్య జరిగిన అగ్ని ప్రమాదం 15 వేల మంది ప్రజలను నిర్వాసితులను చేసింది.
మనీలా: ఫిలిప్పీన్స్లో రాజధాని నగరం మనీలా పోర్టుకు సమీపాన గల మలబాన్ పట్టణంలోని రెండు మురికివాడల మధ్య జరిగిన అగ్ని ప్రమాదం 15 వేల మంది ప్రజలను నిర్వాసితులను చేసింది. బుధవారం రాత్రి నుంచి పది గంటలకు పైగా చెలరేగిన మంటలతో 1000 కి పైగా కుటుంబాలు నీడలేక అల్లాడుతున్నాయి.
అర్థరాత్రి మంటలు చెలరేగడంతో చాలా మంది కట్టుబట్టలతో బయటపడ్డారు. ఎడ్నా పౌరియస్ అనే మహిళ స్పందిస్తూ తన ఆరుగురు పిల్లలు, ముగ్గురు మనుమలతోపాటు హడావుడిగా బయటకు వచ్చామని, ఇల్లు తగలబడిపోయిందని తమ సర్వస్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వమే తమకు ఇల్లు నిర్మించేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. ప్రస్తుత ఇంటి మరమ్మతుకు సాయం లభిస్తుందని ఆశిస్తున్నామని ఓ టీవీ చానెల్ తో ఆమె తెలిపారు.
అయితే అగ్ని ప్రమాదం వల్ల ఏ ఒక్కరికి గాయాలు కాలేదని అగ్ని మాపక దళాధికారి అల్వినో టోర్రెస్ తెలిపారు. నిర్వాసితులైన వారికి తాత్కాలికంగా పునరావాస కేంద్రాల్లో షెల్టర్ కల్పిస్తున్నామని తెలిపారు. పోర్ట్ కు వచ్చే రోడ్డు పక్కనే మురికి వాడలు ఉండటం వల్ల టెలివిజన్ సెట్లు, వాషింగ్ మిషన్లు, బట్టలు అన్ని దగ్ధమయ్యాయి.
వాటిని రోడ్లపై పడవేయడంతో ట్రక్కులు, కంటైనర్ల రాకకు అంతరాయం ఏర్పడింది. మనీలా నగరానికి దక్షిణ దిక్కున వారం క్రితం ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. మనీలాలో అగ్ని ప్రమాదాలు జరగడం సర్వ సాధారణం అని చెప్తున్నారు. 2015లో స్లిప్పర్ల ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 75 మంది మరణించారు.