విషాదం : బొగ్గు గనిలో విష వాయువు లీక్... 16 మంది కార్మికులు మృతి...
చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్టు కాలిపోయి భారీగా కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు విడుదలవడంతో కార్మికులు గనిలోనే చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఆదివారం సెప్టెంబర్ 27) తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లాలోని సొంగ్జావ్ బొగ్గు గనిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
ప్రమాదంపై స్థానిక అధికారులు వీబో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని... దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. నిజానికి చైనాలో గత కొన్నేళ్లుగా గని ప్రమాదాలు తీవ్రంగా పెరిగాయి. సరైన భద్రతా ప్రమాణాలు లేని కారణంగా గనుల్లో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
గత ఏడాది డిసెంబర్లో గుయిజౌ ప్రావిన్స్లోని ఓ బొగ్గు గనిలో గ్యాస్ లీకై పేలుడు సంభవించిన ఘటనలో 14 మంది మృతి చెందారు. డిసెంబర్,2108లోనూ చాంగ్కింగ్ పట్టణంలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు చనిపోయారు.
Recommended Video
అదే ఏడాది అక్టోబర్లో షాండోంగ్ ప్రావిన్స్లోని ఓ బొగ్గు గనిలో చోటు చేసుకున్న ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గనిలో మట్టిపెళ్లలు విరిగిపడి కార్మికులు అందులోనే చిక్కుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కేవలం ఒక్క కార్మికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.