బాలాకోట్ దాడిలో 170 మంది ఉగ్రవాదుల హతం, 45 మందికి చికిత్స : ఇటలీ జర్నలిస్ట్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులపై చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలోనూ వాయుసేన దాడులను ప్రస్తావిస్తుంటే .. విపక్షాలు ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటలీకి చెందిన ఓ జర్నలిస్ట్ భారత వైమానిక దళం దాడి చేసిందని ధ్రువీకరించారు.
170 మంది హతం
ఫిబ్రవరి 26న వాయుసేన జరిపిన దాడుల్లో 170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో తెలిపారు. చనిపోయన 170 మందిలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవారు, బాంబులు తయారు చేసేవారు ఉన్నారని పేర్కొన్నారు. బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరంలో జైషే మహ్మద్ సంస్థ శిక్షణ ఇస్తోందని తెలిపారు. దాడి జరిగిన పాకిస్థాన్ ఎలాంటి అటాక్ చేయలేదని కబుర్లు చెప్పిందని విమర్శించారు. ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని సమర్థించుకునే పనిచేసిందని మండిపడ్డారు.
ఎందుకు అలర్టయ్యారు ?
దాడికి సంబంధించి యావత్ ప్రపంచం గుర్తిస్తుంటే .. పాకిస్థాన్ మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న 3 నుంచి 4 గంటల సమయంలో భారత వైమానిక దళం దాడుల చేసిన తర్వాత షిన్కిరి బేస్ క్యాంపు వద్ద పాకిస్థాన్ తమ బలగాలను మొహరించిందని గుర్తుచేశారు. ఒకవేళ భారత్ దాడి చేయకుంటే ... ఉదయం 6 గంటలకే పాకిస్థాన్ తన బలగాలను ఎందుకు మొహరించిందని ఆమె ప్రశ్నించారు.
45 మందికి చికిత్స
బాలాకోట్ శిబిరం వద్ద భారత్ చేసిన దాడి తర్వాత పాకిస్థాన్ ఆర్మీ వచ్చిందని తెలిపారు. వైమానికి దళం చేసిన దాడుల్లో చనిపోయిన వారు గాక గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. షిన్ కిరి లోని హర్కార్ -ఉల్- ముజాహీద్దిన్ సంస్థ క్యాంపు వద్దకు వారిని తరలించారని ప్రస్తావించారు. దాడిలో గాయపడ్డ 45 మంది ఇప్పటికీ మిలిటరీ క్యాంపులో చికిత్స తీసుకుంటున్నారని గుర్తుచేశారు. చికిత్స తర్వాత కోలుకున్న ఉగ్రవాదులు పాకిస్థాన్ ఆర్మీ కస్టడీలో ఉన్నారని వివరించారు.