ఏడాదిలో 18వేల మందికి మైక్రోసాప్ట్ ఉద్వాసన, ఇంకా..!
న్యూఢిల్లీ: నోకియాను సొంతం చేసుకున్న తర్వాత గడిచిన ఏడాదిలో మైక్రోసాప్ట్లో చాలా మార్పులు జరిగాయి. ఆధునాతన సాంకేతికత, ఆటోమేషన్ పేరుతో గడచిన ఏడాది వ్యవధిలో వివిధ స్ధాయిల్లో 10 వేల మందిని మైక్రోసాప్ట్ తొలగించింది.
ఇందులో 5000 మంది మైక్రోసాప్ట్కు చెందిన వారు కాగా మిగిలిన వారు నోకియా కంపెనీకి చెందిన వారు కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో మరికొంత మందిని తొలగించనున్నట్లు సంకేతాలు పంపింది. ఖర్చులను మరింతగా తగ్గించుకోవాలని భావిస్తున్నామని, ఈసారి హార్డ్వేర్ విభాగంలో పనిచేస్తున్న వారిని తొలగించే అవకాశాలున్నాయని తెలిసింది.
గతేడాది నోకియా వ్యాపారాన్ని 7.2 బిలియన్ డాలర్ల (సుమారు 43 వేల కోట్లు)తో కొనుగోలు చేసిన తర్వాత ఆ మేరకు ఆదాయాన్ని పెంచుకోవడంలో మైక్రోసాప్ట్ విఫలమైంది. ఈ నష్టాన్ని భరించేందుకు గాను మైక్రోసాఫ్ట్కు చెందిన యాడ్ బిజినెస్ వ్యాపారాన్ని జూన్లో ఏఓఎల్కు విక్రయించింది.
అయినా ఆశించినంత స్దాయిలో మంచి ఫలితాలను నమోదు చేయకపోవడంతో హార్డ్ వేర్ రంగం నుంచి దశలవారీగా తప్పుకోవాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న మైక్రోసాప్ట్కు ప్రస్తుతం సత్య నాదెళ్ల సీఈఓగా కొనసాగుతున్నారు.