ఎంహెచ్370: 19వసెంచరీ ఓడ శకలాలు లభ్యం(ఫోటో)
సిడ్నీ: ఇరవై నెలల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం శకలాల కోసం వెతుకుతుండగా ఓ ఓడకు సంబంధించిన శకలాలు బయటపడ్డాయి. 2014 మార్చిలో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన ఎంహెచ్ 370 విమానం గల్లంతైన విషయం తెలిసిందే.
దీని ఆచూకి ఇప్పటి వరకు గుర్తించలేదు. ఈ విమానం శకలాల కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది. నాడు ఆ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ఆచూకీ కనుగొనేందుకు ఆస్ట్రేలియా నేతృత్వంలోని బృందం దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.
ఈ మహా సముద్రంలో వెతుకులాడుతుండగా.. ఓడ శకలాలు లభ్యమయ్యాయి. సముద్రపు అడుగుభాగన అవి కనిపించాయి. ఇలా ఎంహెచ్ 370 కోసం వెతుకుతుండగా ఓడ శిథిలాలు కనిపించడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్ నెలలో 200 ఏళ్ల క్రితం ఓడ శిథిలాలు లభించాయి.
తాజాగా ఇప్పుడు కనిపించిన శిథిలాలు.. 19వ సెంచరీకి చెందినవి అయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఓడ స్టీల్ లేదా ఐరన్తో చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎంహెచ్ 370 కోసం వెతుకుతుండగా.. ఇప్పటికి రెండుసార్లు పాత ఓఢ శకలాలు దొరికాయి. కానీ విమాన శకలాలు మాత్రం లభ్యం కాలేదు.