నివాస ప్రాంతాలపై కుప్పకూలిన విమానం: 19 మంది మృతి
గోమా: మధ్య ఆఫ్రికా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో)లో ఓ విమానం కుప్పకూలింది. నివాసప్రాంతాలై ఈ విమానం కూలడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది మొత్తం 19 మంది ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
టేకాఫ్ అయిన కాసేపటికే..
ప్రమాదంలో విమానంలోని ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు చెప్పారు. గోమా ఎయిర్పోర్టు నుంచి బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం బెనీకి బయల్దేరింది. గాల్లోకి లేచిన కాసేపటికి నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
సాంకేతిక లోపమే..?
అక్కడి కాలమామన ప్రకారం ఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. సంఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భయాందోళనలో ప్రజలు..
ఒక్కసారిగా జరిగిన ప్రమాద ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలంతా ఏం జరిగిందో తెలియక మొదట అయోమయానికి గురయ్యారు. విమాన ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో అక్కడి భారీగా జనం చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలు వెలికితీయగా, మిగితా మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.