ఎయిర్ ఏషియా: ఐదు భారీ శకలాలు, ఆదివారం అనుమతి లేదు!
ఇండోనేషియా: వారం రోజుల క్రితం జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానానికి చెందిన రెండు పెద్ద లోహ భాగాలు సముద్రంలో కనిపించినట్లు ఇండోనేషియా అధికారులు శనివారం చెప్పారు. ఆదివారం నాడు మరో మూడు శకలాలు గుర్తించారు. మొత్తం ఐదింటిని గుర్తించారు. కాగా 162 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కూలిపోయిన సమయంలో అనధికారిక షెడ్యూల్లో ప్రయాణిస్తున్నట్లు కూడా ధ్రువీకరణ అయింది.
రెండు పెద్ద వస్తువులు కనిపించాయని, ఇవి నిన్న చమురు తెట్టు కనిపించిన చోటికి దగ్గర్లోనే నీటి అడుగున 30 మీటర్ల లోతులో ఉన్నాయని ఇండోనేషియాకు చెందిన గాలింపు ఏజన్సీ బసర్నాస్ చీఫ్ బంబాంగ్ సోలిస్ట్యో చెప్పారు. ఈ రెండు వస్తువులు పంగ్కలాన్ బన్ సమీపంలో సముద్రం అడుగున కనిపించాయన్నారు.
వీటిలో ఒకటి 9.4 మీటర్ల పొడవు, 4.8 మీటర్ల వెడల్పు, అరమీటరు ఎత్తు ఉందని ఆయన చెప్పారు. దానికి దగ్గర్లోనే కనిపించిన మరో వస్తువు 7.2 మీటర్ల పొడవు, అరమీటరు వెడల్పు ఉందని తెలిపారు. చమురు తెట్టుతో పాటుగా విమానానికి చెందిన రెండు పెద్ద భాగాలు కనిపించినందున అవి తాము వెతుకుతున్న ఎయిర్ ఏషియా విమానానికి చెందినవేనని తాను కచ్చితంగా చెప్పగలనని సోలిస్ట్యో చెప్పారు.
సముద్రం అడుగున కనుగొన్న ఈ వస్తువులు వాస్తవంగా ఏమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి రిమోట్తో ఆపరేట్ చేసే అండర్వాటర్ వెహికిల్ (ఆర్ఓవి)ని నీటి అడుగుకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ కూడా 30 మీటర్ల లోతులో ఉన్నాయన్నారు. అయితే అలల తీవ్రత బలంగా ఉన్నందున ఈ ఆర్ఓవిని ఆపరేట్ చేయడం కష్టంగా ఉందన్నారు. చమురు తెట్టు, రెండు వస్తువులు కనిపించిన చోటికి మూడు నౌకలను పంపిస్తున్నట్లు చెప్పారు.
30 మృతదేహాల వెలికితీత
ఇప్పటి వరకు 30 మృతదేహాలను జావా సముద్రంలోంచి వెలికి తీశారు. అయితే ప్రతికూల వాతావరణం కొనసాగుతూ ఉండడంతో విమానం డేటా రికార్డుల కోసం అన్వేషణ మాత్రం ముందుకు సాగడం లేదు. సముద్రం అడుగున కనిపించిన ఈ రెండు వస్తువులు కూడా గత ఆదివారం 162 మందితో వెళ్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలను కోల్పోయిన ఎయిర్బస్ ఎ320 విమానానికి చెందిన ప్రధాన భాగాలని కూడా సోలిస్ట్యో చెప్పారు.
విమానం విండోప్యానెల్ను పోలిన మరోముక్క కూడా కనిపించిందని సింగపూర్ రక్షణ శాఖ తెలిపింది. ఎయిర్ ఏషియా విమానం అధికారులు అనుమతించని ఫ్లైట్టైమ్లో ప్రయాణిస్తున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ అధికారులు శుక్రవారం రాత్రి చెప్పారు.
ఆదివారం రోజుల్లో సురబయ-సింగపూర్ మార్గంలో ప్రయాణించడానికి ఎయిర్ ఏషియా విమానానికి అనుమతి లేదని, సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉందని, అయితే ఎయిర్ ఏషియా ఆదివారం కూడా ఈ రూట్లో విమానాన్ని నడుపుతోందని అధికారులు చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ మార్గంలో ఎయిర్ ఏషియా పర్మిట్ను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు.