రెండు కారు బాంబు పేలుళ్లు: 118 మంది మృతి
జోస్: నైజీరియాలోని జోస్ నగరంలో మంగళవారం రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. బస్సు టెర్మినల్ వద్ద ఒకటి, మార్కెట్ వద్ద మరోటి పేలాయి. ఈ ఘటనలో 118 మంది మృత్యువాత పడ్డారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. రెండు చోట్ల కారులో పెట్టిన బాంబులు పేలాయి.
ఈ రెండు కారు బాంబు పేలుళ్ల ఘటనకు ఎవరు బాధ్యులనేది తెలియడం లేదు. ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూప్ బోకో హరాం దీనికి కారణం కావచ్చునని అనుమానిస్తున్నారు. ఈ గ్రూప్ గత నెలలో 300 మంది పాఠశాల బాలికలను అపహరించింది.
దానికితోడు బస్సు స్టేషన్లను, ఇతర ప్రాంతాలను తరుచుగా లక్ష్యం చేసుకుంటోంది. పేలుళ్ల సంభవించిన ప్రాంతంలో వాతావరణం భయానకంగా ఉంది. డజన్ల కొద్ది దేహాలు, శరీర భాగాలు ధాన్యంలో కూరుకుపోయాయి. రెండో కారులో ధాన్యం ఉంచి పేల్చివేశారు.
బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతాల్లో మంటలు లేచాయి. శరీరాలు మంటల్లో కాలిపోతూ కనిపించాయి. జోస్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.