అమెరికాలో కాల్పుల మోత, అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఫైరింగ్, ఇద్దరి మృతి
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ప్లోరిడాలోని పశ్చిమ పామ్ బీచ్ ప్రాంతంలో దుండగులు రెచ్చిపోయారు. రివెరా బీచ్ సమీపంలోని విక్టరీ సిటీ చర్చ్ వద్ద అంత్యక్రియలు జరిపే సమయంలో సాయుధలైన దుండగులు కాల్పుల మోత మోగించారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు చర్చి సమీపంలో అందరూ గుమిగూడారు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు తుపాకీలతో వచ్చారు. వస్తూనే ఫైరింగ్ స్టార్ట్ చేశారు. కాల్పుల్లో 15 ఏళ్ల బాలుడు, మరొకరు అక్కడికక్కడే నెలకొరిగారు. మహిళ, మరో టీనేజర్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను గురించి ఇంకా తెలియరాలేదు.
చర్చ్ సమీపంలో ఏర్పాటుచేసిన వినికిడి శబ్ధం కోసం (లిజనింగ్ డివైజ్)లో 13 రౌండ్ల కాల్పులు జరిపినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులెవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై చర్చ్ పాస్టర్ ల్యూపో విచారం వ్యక్తం చేశారు. నిందితులు వ్యక్తులపైనే కాల్పులు జరిపారని.. చర్చ్ ఆస్తికి నష్టం కలిగించలేదని పేర్కొన్నారు.