ఇద్దరు పోలీసాఫీసర్లను కాల్చి చంపిన బ్లాక్, ఆపై ఆత్మహత్య
న్యూయార్క్: అమెరికా పోలీసులపై నల్ల జాతీయుల ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. న్యూయార్క్లోని బ్రూక్లిన్ ప్రాంతంలో వెంజిన్ లీ, రాఫెల్ రామోస్ అనే ఇద్దరు పోలీసు అధికారుల్ని ఇస్మాయిల్ బ్రిన్స్లీ (28) అనే నల్ల జాతీయుడు కాల్చి చంపాడు. ఇద్దరు అధికారులు తమ గస్తీ కారులో ఉండగానే బ్రిన్స్లీ వారి కారు దగ్గరికి వెళ్లి అత్యంత సమీపం (పాయింట్ బ్లాంక్) నుంచి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి హతమార్చాడు. వెంటనే సమీపంలోని ఒక సబ్వే స్టేషన్కి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లంచ్ తింటుండగా అతను ఇద్దరు పోలీసు అధికారులను కాల్చి చంపాడు. వారికి తమ ఆయుధాలను తీసే వ్యవధి కూడా లేకుండా పోయింది.
ఎరిక్ గార్నర్, మైఖేల్ బ్రౌన్ అనే నల్ల జాతీయుల హత్యకు ప్రతీకారంగా పోలీసులను హత్య చేయబోతున్నట్టు బ్రిన్స్లీ ముందుగానే సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇద్దరు పోలీసు అధికారుల హత్యతో న్యూయార్క్ పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. న్యూయార్క్ మేయర్, పోలీసు కమిషనర్ ఈ హత్యలపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు.
న్యూయార్క్లో ఇద్దరు పోలీసు అధికారుల హత్యను అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా ఖండించారు. ఈ హత్యలు ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు. మరోవైపు ఆగస్టులో మైఖేల్ బ్రౌన్ అనే నల్ల జాతీయుడిని హత్య చేసిన పోలీసు అధికారిని నిర్దోషిగా ప్రకటించడంపై అమెరికాలో నిరసనలు కొనసాగుతున్నాయి.
ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికన్లు పెద్ద పెద్ద షాపింగ్స్ మాల్స్ ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్లోని ‘మాల్ ఆఫ్ అమెరికా' ముందు కూడా పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. షాపింగ్ మాల్స్ ముందు నిరసన ప్రదర్శనలు జరిపితే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు.