బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన మసీదు: ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఘోరం: 20 మందికి పైగా దుర్మరణం
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మసీదులో రెండు శక్తిమంతమైన బాంబులు పేలాయి. ఈ ఘటనలో 20 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫలితంగా- మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు.
ఈ ఘటన పేలుడు వల్లే చోటు చేసుకుందా? లేక మోర్టార్లతో దాడి చేశారా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. సంఘటనాస్థలంలో మోర్టార్లు లభించడంతో అధికారుల్లో ఈ రకమైన సందేహాలు నెలకొన్నాయి. ఈ ఘటనకు తామే కారణమని ఇప్పటిదాకా కూడా ఏ ఉగ్రవాద సంస్థ గానీ, వ్యక్తులు గానీ ప్రకటించలేదు. అయినప్పటికీ.. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని స్థానిక పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.
ముస్లింలకు శుక్రవారం ప్రత్యేకమైన రోజు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించడం వారి అలవాటు. అదే తరహాలో ఆఫ్ఘనిస్తాన్ లోని నన్గర్ హర్ ప్రావిన్స్ లోని హస్ కా మెయ్నా జిల్లా జాదారా ప్రాంతంలో గల ఓ ప్రఖ్యాత మసీదులో ప్రార్థనలను నిర్వహించడానికి స్థానికులు ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రార్థనలు కొనసాగుతుండగానే మసీదు ఆవరణలో రెండు శక్తిమంతమైన బాంబులు విధ్వంసాన్ని సృష్టించాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ జంట పేలుళ్ల బారిన పడ్డారు స్థానికులు. బాంబు పేలుళ్ల ధాటికి మసీదు ధ్వంసమైంది. చాలా భాగం కుప్పకూలిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే హస్ కా మెయ్నా జిల్లా పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. అంబులెన్స్ లను రప్పించారు. గాయపడ్డ వారికి సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మసీదులో పేలుడు చోటు చేసుకున్న విషయాన్ని నన్గర్ హర్ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అతహుల్లా ఖొగ్యానీ ధృవీకరించారు. పేలుళ్ల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా? లేక మోర్టార్లతో దాడి చేశారా? అనే విషయాన్ని నిర్దారించాల్సి ఉందని చెప్పారు. మోర్టార్లతో దాడికి పాల్పడటానికే అధికంగా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 50 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులు 40 మందేనని ఖొగ్యానీ వెల్లడించారు.