ఘోర ప్రమాదాలు: నైజీరియాలో 20మంది, కెన్యాలో 30మంది మృతి
లాగోస్: నూతన సంవత్సరం రోజున నైజీరియా, కెన్యా దేశాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నైజీరియాలో రెండు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలోని జింగ్వా, ఒగున్ రాష్ట్రాలో ఈ దుర్ఘటనలు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు.
జింగ్వా రాష్ట్రంలో బస్సు-ట్రక్కు ఢీకొనడంతో 15 మంది మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఏడుగురు ఎక్కాల్సిన వాహనంలో 14 మంది ప్రయాణికులు ఎక్కడంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు వివరించారు.
ఒగున్ రాష్ట్రంలో జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కమాండ్ అధికారి తెలిపారు.
ఇది ఇలా ఉండగా, కెన్యాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30మంది మరణించారు. మరో 16మంది వరకు తీవ్రగాయాలపాలయ్యారు. అత్యంత వేగంగా వెళుతున్న ట్రక్కు, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.