కిరాతకం: నిద్రిస్తున్న 20 మంది కూలీలను కాల్చి చంపేశారు
ఇస్లామాబాద్: కష్టపడి పని చేసిన తరువాత భోజనం చేసి నిద్రపోతున్న వారి మీద కిరాతకులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 20 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముగ్గురు కార్మికులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ లోని టుర్బట్ నగరం శివార్లలోని లేబర్ క్యాంప్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. సింద్, పంజాబ్ ప్రాంతాలకు చెందిన కార్మికులు టుర్బట్ నగరం శివర్లాలలో జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణం పనులు చెయ్యాడానికి వెళ్లారు.
శుక్రవారం రాత్రి వరకు పనులు చేసి లేబర్ క్యాంప్ లోని గుడారాల దగ్గరకు వెళ్లారు. తరువాత భోజనం చేసి అందరూ నిద్రపోయారు. శనివారం వేకువ జామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో గుర్తు తెలియన వ్యక్తులు తుపాకులు తీసుకు వచ్చి కార్మికుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
20 మంది సంఘటనా స్థలంలో ప్రాణాలు వదిలారు. బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారైనాయని పోలీసులు అన్నారు. ఉగ్రవాదులే కార్మికులను చంపి ఉంటారని వెలుగు చూసింది. అయితే కార్మికులను ఎందుకు హత్య చేశారనేది తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని పాకిస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు.