పాకిస్తాన్లో ఘోరం: దుస్తులు విప్పేసి పొడిచి చంపారు
మతిస్థిమితం లేని కొందరు వ్యక్తులు... ఇరవై మందిని దారుణంగా పొడిచి చంపిన ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది.
ఇస్లామాబాద్: మతిస్థిమితం లేని కొందరు వ్యక్తులు... ఇరవై మందిని దారుణంగా పొడిచి చంపిన ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. స్థానిక సర్గోధా జిల్లాలో మహమ్మద్ అలీ గుజ్జర్ దర్గాలో అబ్దుల్ వహీద్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారు.
వీరిలో అబ్దుల్ వహీద్కి మతిస్థిమితంలేదు. ఈ నేపథ్యంలో అబ్దుల్ మరో ఇద్దరు సహచరులతో కలిసి శనివారం దర్గాకి వచ్చిన భక్తుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఇరవై మందికి డ్రగ్స్ ఇచ్చారు.
మత్తులో పడిపోయి ఉన్న వారందరి దుస్తులు విప్పేసి ఆ తర్వాత దారుణంగా పొడిచారు. వీరు ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డారో తెలియలేదు. కానీ వారు ముగ్గురూ గత రెండేళ్లుగా సర్గోధా జిల్లాలోని చుట్టు పక్క ప్రాంతాలకు వచ్చి ప్రార్థనలు చేస్తుండేవారని స్థానికులు తెలిపారు.
ప్రస్తుతం పోలీసులు దర్గాలో సంరక్షకులుగా పని చేస్తున్న అయిదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
భక్తులు తమ పాపాలు కడిగేసుకోవడానికి ఈదర్గాకి వస్తుంటారు. అంతేకాదు ఇక్కడి సంరక్షకుల చేత వాతలు పడేలా కొట్టించుకుంటారు కూడా. కానీ శనివారం వచ్చిన భక్తులకు ముందు డ్రగ్స్ ఇచ్చి వారి దుస్తులు విప్పేసి కత్తితో పొడిచి ఆ తర్వాత వారిని కొట్టారని తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత దర్గాను తాత్కాలికంగా మూసేసి, బందోబస్తు ఏర్పాటు చేశారు.