ఈ లోక్ సభ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ ..? ఖర్చు 71 వేల కోట్లు దాటే అవకాశం ఉందన్న పొలిటికల్ ఆనలిస్ట్
హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మళ్లీ ఏ పార్టీ గెలుస్తోంది. ఏ కూటమి అధికారంలోకి వస్తోందనే అంశం చర్చానీయాంశమైంది. ప్రజలు మోదీ వైపే ఉన్నారా ? లేదా రాహుల్, ప్రియాంక వైపు మొగ్గుచూపుతున్నారా అనే డిస్కషన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఫెడరల్ ఫ్రంట్ తో ఏ మేరకు ప్రయోజనం .. ప్రాంతీయ పార్టీలకు మేలు చేస్తోందా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. పార్టీల బలబలాలు, విజయవాకాశాల సంగతి కాసేపు పక్కనపెడితే .. వచ్చే లోక్ సభ ఎన్నికలు మాత్రం చాలా కాస్ట్లీ అని ఓ పొలిటికల్ ఆనలిస్ట్ అంచనా వేశారు.
ఎందుకు కాస్ల్టీ అంటే ..
వచ్చే ఎన్నికలను అధికార బీజేపీ సహా విపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎలాగైనా గెలువాలని భావిస్తున్నాయి. తమ పార్టీ విజయం సాధించడం కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనుకాడబోమనే కృతనిశ్చయంతో ఉన్నట్టు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థ అంచనా వేసింది. అధికార, విపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉన్న నేపథ్యంలో ఖర్చు చేసేందుకు రాజకీయ పార్టీలు వెనుకాడడం లేదని తెలిపింది.
వామ్మో 71 వేల కోట్లా ..?
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టాలని భావిస్తోన్న రాజకీయ పార్టీలు రూ. 71 వేల 25 కోట్లు ఖర్చు చేస్తాయని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ దక్షిణాసియా డైరెక్టర్, ఫెలో మిలాన్ వైష్ణవ్ అంచనా వేశారు. 2014లో పార్లమెంట్ ఎన్నికల కోసం రూ.35 వేల 512 కోట్లు వ్యయం చేశారు. ఈ సారి రాజకీయ పార్టీలు అందుకు రెట్టింపు ఖర్చు చేయడానికి వెనుకాడబోవని ఆయన స్పష్టంచేశారు.
ఖరీదైన ఎన్నికలు
భారత్ లో జరిగే ఎన్నికలే ఖరీదైనవని వైష్ణవ్ చెప్తున్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటివరకు జరిగిన ఖరీదైన ఎన్నికలు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలే. ఇందుకోసం అయినా రూ.46 వేల 166 కోట్ల ఖర్చును చూసి వామ్మో అన్నారు. ఇప్పుడు ఆ మార్కును భారత్ తాకబోతుండటంతో .. ఖరీదైన ఎన్నికలుగా లోక్ సభ ఎలక్షన్స్ నిలువనున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారాయన.
విరాళాల సేకరణ లోపం
ఎన్నికల వ్యయాన్ని అంచనా వేసిన వైష్ణవ్ .. దేశంలో రాజకీయ పార్టీలకు అందజేసే విరాళాల విధానంలో పారదర్శకత లోపించిందన్నారు. దీంతో ఏ రాజకీయ పార్టీ ఎక్కడినుంచి ఎంత మొత్తాన్ని సేకరిస్తుందో తెలుసుకోవడం కష్టమవుతోందని తెలిపారు. అలాగే తాము విరాళాలు అందజేసిన పార్టీ గురించి చెప్పేందుకు వెనకాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక వేధింపులు తప్పవనే ఉద్దేశ్యంతో చాలామంది విరాళాలు బహిర్గతం చేయడం లేదని గుర్తుచేశారు. దీంతోపాటు కొత్తగా అమల్లోకి వచ్చిన ఎన్నికల్ల బాండ్ల విధానం వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని తేల్చిచెప్పారు.