పట్టాలు తప్పిన రైలు.. నదిలో 22 బోగీలు
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలుకు చెందిన 22 బోగీలు నదిలో పడిపోయాయి.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలుకు చెందిన 22 బోగీలు నదిలో పడిపోయాయి. అదృష్టవశాత్తు ఇది గూడ్సు రైలు కావడంతో ప్రాణహాని జరగలేదు.
ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. గ్రీటర్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ట్రేసీ సిటీ నుంచి స్కార్ మెంటో మెట్రోపాలిటన్ ప్రాంతంలోని రోజ్ విల్లేకు ఆహార పదార్థాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ రైలు ఎల్క్ గ్రోవ్ సిటీ వద్ద ప్రమాదానికి గురైనట్లు యూనియన్ పసిఫిక్ రైల్ బోర్డ్ అధికార ప్రతినిధి జస్టిన్ జాకోబ్స్ తెలిపారు. రైలులో మొత్తం 33 బోగీలు ఉండగా, వాటిలో 22 బోగీలు అదుపుతప్పి ఉప్పొంగి ప్రవహిస్తున్న కోసుమీన్ నదిలోకి పడిపోయాయి.
ఈ రైలు ప్రమాదానికి దారితీసిన కారణాలపై స్థానిక రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవలి భారీ వర్షాలకు ఈ నదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నదిలో పడిపోయిన బోగీల తరలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.