అర్మేనియా-అజర్బైజాన్ ఘర్షణలు: 23 మంది మృతి, వందలాది మందికి గాయాలు
వెరవన్: నాగోర్నో-కరాబాఖ్ ప్రత్యేక ప్రాంతం కోసం ఆర్మేనియన్, అజర్బైజాన్ దళాల మధ్య భీకరమైన ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సుమారు 23 మంది మరణించగా, 100 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘర్షణలో 16 మంది అర్మేనియన్ వేర్పాటువాదులు చంపబడ్డారు. వందమందికిపైగా గాయాలపాలయ్యారు.
ఈ మేరకు అల్ జజీరామా మీడియా వివరాలను వెల్లడించింది. ఇరువైపులా కూడా ప్రాణ నష్టం జరిగిందని తెలిపింది. ఒక అర్మేనియన్ మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించింది.
అర్మేనియన్ వేర్పాటువాదులు ప్రయోగించిన షెల్లింగ్ దాడిలో అజర్బైజాన్ కు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. వివాదాస్పదంగా ఉన్న నాగోర్నో-కరాబాఖ్లో ఇంతకుముందు కూడా అజర్బైజాన్, అర్మేనియ బలగాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది.
వివాదాస్పద ప్రాంతం కోసం ఓ వైపు అజర్ బైజాన్, మరోవైపు అర్మేనియా తీవ్రమైన పోరాటం చేస్తున్నాయి. పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ఇరువైపుల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. అయినా, తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.
పొరుగున ఉన్న అజర్బైజాన్.. నాగోర్నో-కరాబాఖ్లోని "పౌర స్థావరాలను దెబ్బతీస్తుందని" అర్మేనియా ఆరోపించింది - ఇది అంతర్జాతీయంగా అజర్బైజాన్లో భాగంగా గుర్తించబడినప్పటికీ.. అర్మేనియన్ దళాలచే నియంత్రించబడుతుంది.
కాగా, అజర్బైజాన్ దీనిని "ప్రతిఘటన" గా అభివర్ణించింది, అయితే స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ ఆర్తాఖ్.. అజర్బైజాన్ దళాలు పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై, దాని రాజధాని స్టెపనకేర్ట్లో కాల్పులు జరిపాయని ఆరోపించింది.