232 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల హతం
కైరో: ప్రసిద్ది చెందిన ద్వీపకల్పంలో మకాం వేసి మారణహోమాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులను అంతం చెయ్యడానికి ఈజిప్ట్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
ఈజిప్ట్ సైన్యం వరుసగా నాలుగు రోజుల నుంచి ఉగ్రవాదులను అంతం చేస్తున్నారు. అమరవీరులకు నివాళి అనే పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టారు. చారిత్రక సీనాయి ద్వీపకల్పాన్ని స్థావరంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు.
ఈజిప్ట్ మీద ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేస్తున్నారు. ఈజిప్ట్ సైన్యం నాలుగు రోజుల క్రితం ఈ ద్వీపాన్ని చుట్టుముట్టింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తప్పించుకోకుండా, ఎదురు దాడులకు దిగకుండా జాగ్రతలు తీసుకుంది. శనివారం వరకు 232 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేశారు.
శుక్రవారం ఒక్క రోజే 98 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేశామని ఈజిప్ట్ సైన్యం అధికార ప్రతినిధి మహమ్మద్ సమీర్ మీడియాకు చెప్పారు. 2013లో అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ గద్దెదిగిన తరువాత ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఈజిప్ట్ లో మకాం వెయ్యడానికి విఫలయత్నం చేస్తున్నారు.