16గం.ల పాటు చలికి వణుకుతూ, ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో విమానంలోనే 250 మంది ప్రయాణీకులు
మోంట్రీయాల్: యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం కారణంగా 250 మంది ప్రయాణీకులు దాదాపు పదమూడు గంటల నుంచి పదహారు గంటల వరకు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. చలికి వణికిపోతూ నరకయాతన అనుభవించారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ కావడంతో తినేందుకు తిండి లేక అల్లాడిపోయారు. వారికి విమానం నుంచి బయటకు వచ్చే వీల్లేకుండా పోయింది.
టేకాఫ్ చేసేందుకు వీలుపడలేదు
ఈ విమానం న్యూజెర్సీలోని నెవార్క్కు వెళ్లాల్సి ఉంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కెనడాలోని గూసె బే విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని ఆసుపత్రికి పంపించిన తర్వాత విమానాన్ని టేకాఫ్ చేసేందుకు వీలు పడలేదు. ఎందుకంటే అక్కడి వాతావరణం మైనస్ 30 డిగ్రీలుగా ఉంది.
విమానం డోర్ బిగుసుకుపోయింది
విమానం డోర్ మూయబోతుండగా అది బిగుసుకుపోయింది. తలుపు బాగు చేయించేందుకు సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ప్రయాణికులు ఆ రాత్రి మొత్తం విమానంలోనే చలిలోనే వణుకుతూ ఉండిపోయారు. రాత్రివేళ కావడం వల్ల కస్టమ్స్ అధికారులు లేరు. దుప్పట్లు కప్పుకున్నప్పటికీ చలికి వణికిపోయారు.
మరో విమానం వద్దకు తరలింపు
ఈ విషయాన్ని విమానంలో ప్రయాణిస్తున్న సోంజయ్ డటర్సన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఆహార పదార్థాలు, చలికి వణుకుతూ ఇబ్బందులుపడుతున్నామని, దయచేసి సాయం చేయాలని అతడు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది ప్రయాణికులను వేరే విమానం వద్దకు తరలించారు.