లఖ్వీ స్వర నమూనా ఇవ్వలేం: మాటమార్చిన పాక్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల బాధ్యుల కేసులు త్వరితగతిన చక్కబెడతామని ప్రధాని నరేంద్ర మోడీకి రష్యాలోని ఉఫాలో హామీ ఇచ్చిన రెండురోజులకే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సర్కారు మాటమార్చింది. ముంబై పేలుళ్ల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ స్వర నమూనాలు ఇచ్చే ప్రసక్తేలేదని పాక్ అధికార ప్రతినిధి రిజ్వాన్ అబ్బాసి ఆదివారం ప్రకటించారు.
దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్షరీఫ్ మధ్య ఉఫాలో కుదిరిన అవగాహన వీగిపోయినట్లయింది. భారతదేశం కోరుతున్న విధంగా రెహ్మాన్ లఖ్వీ స్వ నమూనాల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం సాధ్యంకాదని పాక్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. పాకిస్థాన్ చట్టం ప్రకారం సదరు వ్యక్తి అంగీకరిస్తేనే అతని స్వర నమూనాలు తీసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
లఖ్వీ తన స్వర నమూనా ఇచ్చేందుకు నిరాకరిస్తే పాక్ ప్రభుత్వం ఏమీచేయలేదని రిజ్వాన్ అబ్బాసీ స్పష్టం చేశారు. ఈ అంశంపై రెండు దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో చర్చ జరుగుతుందంటూ ఆయన దాటవేశారు.
కోర్టు అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతే లఖ్వీని విడుదల చేసిందన్న విషయం మరువకూడదని ఆయన పేర్కొన్నారు. లఖ్వీని అరెస్టు చేసేందుకు లేదా అతని కార్యకలాపాలు అదుపు చేసేందుకు వీలుగా కోర్టులో పిటిషన్ వేయటం సాధ్యంకాదని పాక్ అధికార ప్రతినిధి చెప్పారు.
నరేంద్ర మోడీ, నవాజ్షరీఫ్ మధ్య రష్యాలోని ఉఫాలో చేసిన సంయుక్త ప్రకటనకు పాకిస్తాన్ సైన్యం, గూడఛార సంస్థ ఐఎస్ఐ ఆమోదం ఇవ్వలేదని చెబుతున్నారు. లఖ్వీని అరెస్టు చేయాలన్నా, అతని కార్యకలాపాలను అదుపుచేయాలన్నా సైన్యం రంగంలోకి దిగాల్సిందేనని తెలిపారు. సైన్యం, ఎస్ఐఎస్ జోక్యం చేసుకోకుంటే లఖ్వీని అదుపు చేయటం అనేది అసాధ్యమని చెప్పారు.
ఇప్పుడు లఖ్వీపై మళ్లీ కోర్టులో పిటిషన్ వేసే ప్రసక్తేలేదని పాక్ అధికార ప్రతినిధి స్పష్టమైన ప్రకటన చేయటం వెనుక సైన్యం, ఐఎస్ఐ ఉందని అంటున్నారు. పాక్ అధికార ప్రతినిధి చేసిన ప్రకటనపై విదేశాంగ శాఖ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు. నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాతే ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.