భారత్ నిరసన: మళ్లీ తగ్గిన పాక్, మరో కేసులో అదుపులోకి లఖ్వీ
లాహోర్: 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి అదుపులోకి తీసుకుంది. అతనిని పాకిస్తాన్ పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకుంది. అతనిని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
మంగళవారం నాడు లఖ్వీ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. అతనిని మరోసారి అరెస్టు చేశారని చెప్పారు. తాము దీనిని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. అంతర్గత ఒత్తిడుల వల్ల లఖ్వీ తన ప్రాథమిక హక్కును కోల్పోయేలా చేస్తున్నారని వాపోయారు.
కాగా, ముంబైలో 2008నాటి ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి జాకీర్ రెహ్మాన్ లఖ్వీ విషయంలో పాకిస్థాన్ దోబూచులాట ఆడుతున్న విషయం తెలిసిందే. కరుడుగట్టిన ఈ ఇస్లామిక్ ఉగ్రవాది నేరచరిత్ర జగద్విదితమే అయినప్పటికీ ప్రస్తుతం కటకటాల్లో ఉన్న అతనికి ఏదోవిధంగా స్వేచ్ఛను ప్రసాదించేందుకు తిప్పలు పడుతోంది.
లఖ్వీని నిర్బంధిస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన శాంతిభద్రతల పరిరక్షణ ఉత్తర్వుపై (ఎంపీవో)కోర్టులో విచారణకు ప్రభుత్వ తరఫున న్యాయవాది గైర్హాజరు కావడంతో ఆ తీవ్రవాదికి సులభంగా మళ్లీ బెయిల్ వచ్చేలా సహకరించింది. దీంతో లఖ్వీ తరఫున సోమవారం కోర్టుకు రూ.10 లక్షల పూచీకత్తును సమర్పించినట్లు అతని న్యాయవాది రజా రిజ్వాన్ అబ్బాస్ తెలిపారు.
ప్రస్తుతం లఖ్వీ అడియాల జైలులో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన లఖ్వీని నిర్బంధిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును ఇస్లామాబాద్ హైకోర్టు(ఐహెచ్సీ) సోమవారం నిలుపుదల చేసింది.
కాగా, ఇస్లామాబాద్ హైకోర్టులో లఖ్వీకి ఉపశమనం లభించినంతమాత్రాన అతన్ని విడుదల చేసేది లేదనీ, మరో కేసులో నిర్బంధంలో కొనసాగించే అవకాశం ఉందనీ పాక్ ఆంతరంగిక శాఖలోని ఉన్నతాధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇప్పుడు ఆయనను మరో కేసులో నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు భారత్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నోటీసులు కూడా జారీ చేసింది.