కసబ్ బతికే ఉన్నాడట: లఖ్వీ సాక్ష్యం
లాహోర్: నవంబర్ 26, 2008లో ముంబై దాడుల్లో పట్టుబడి, ఉరితీయబడ్డ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బతికే ఉన్నాడట. ఈ విషయాన్ని ఫరీద్కోట్లో కసబ్కు మూడేళ్ల పాటు పాఠాలు చెప్పిన ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ ముదస్సీర్ లఖ్వీ, 26/11 ముంబై దాడుల కేసును విచారిస్తున్న ఇస్లామాబాద్ కోర్టులో చెప్పాడు.
కసబ్ను 2012 నవంబర్లో భారతదేశంలో పుణె జైలులో భారత ప్రభుత్వం ఉరితీసిన విషయం తెలిసిందే. పాక్స్థాన్ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో బుధవారం జరిపిన భేటీలో ముంబై దాడుల కేసును వేగవంతం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు గురువారం విచారణ ప్రారంభించింది.
ముదస్సీర్ వ్యాఖ్యలతో కోర్టు సిబ్బంది కొంత అయోమయానికి గురయ్యారు. ఈ హెడ్మాస్టర్ ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ సొంతూరివాడు. హెడ్మాస్టర్పై అతని ఒత్తిడి ఏమైనా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
2014 మేలో జరిగిన విచారణలోనూ కసబ్ బతికే ఉన్నాడని కోర్టుకు ముదస్సీర్ తెలిపాడు. ఇండియాలో మరణశిక్షకు గురైన కసబ్, హెడ్మాస్టర్ వద్ద చదువుకున్న కసబ్ ఒక్కడేనా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
భారతదేశంలో ఉరిశిక్ష పడిన కసబ్ గురించి ఆ హెడ్ మాస్టర్ ప్రస్తావించలేదు. తాను చెబుతున్న కసబ్ భారతదేశంలో ఉరిశిక్ష పడిన కసబ్ ఒక్కడేనా కాదా అనే విషయం కూడా అతను చెప్పలేదు. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 16వ తేదీకి వాయిదా పడింది.