UNSC గ్రీన్ సిగ్నల్ : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ రెచ్చిపోతాడా..?
న్యూయార్క్: ఉగ్రవాదంకు పాక్ అండగా నిలుస్తోందని చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ ఘటన. 26/11 ముంబై మారణహోమం ప్రధాన సూత్రధారి లష్కరే తొయిబా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ను ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. దీంతో హఫీజ్ సయీద్పై పలు ఆంక్షలు విధించడం జరిగింది. తాజాగా హఫీజ్ సయీద్కు తన బ్యాంకు ఖాతాలకు యాక్సెస్ కల్పించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పాక్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ ఇవ్వాలంటూ పాక్ లేఖ
పాక్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన భద్రతామండలి ఆగష్టు 15వరకు అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ సభ్యదేశాలకు సూచించింది. అయితే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో హఫీజ్ సయీద్ పట్ల పాక్ చేసిన విజ్ఞప్తికి ఓకే చెప్పింది భద్రతామండలి. హఫీజ్ సయీద్ పై ఆంక్షలు విధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కుటుంబ పోషణ భారం తనపై ఉన్నందున తన బ్యాంకు ఖాతానుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పాక్ కోరింది. హఫీజ్ సయీద్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని లేఖలో పేర్కొంది.
అభ్యంతరం వ్యక్తం చేయని సభ్యదేశాలు
హఫీజ్ సయీద్ ఖాతానుంచి పాకిస్తాన్ రూపీ కరెన్సీలో రూ.11 లక్షల 50వేలు విత్డ్రా చేసుకునేందుకు పాక్ ప్రభుత్వానికి హఫీజ్ సయీద్ లేఖ రాశారని పాకిస్తాన్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతామండలి దృష్టికి తీసుకొచ్చింది. సయీద్పై భద్రతామండలిలోని సభ్య దేశాలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో పాక్ పెట్టుకున్న విజ్ఞప్తికి ఆమోదం తెలుపుతూ ఈ మేరకు సెక్రటేరియట్ నుంచి అధికారికంగా లేఖ విడుదల చేస్తామని ఐక్యారాజ్యసమితి భద్రతా మండలి వెల్లడించింది.
హఫీజ్కు పాక్ అండ
తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందనే విషయం స్పష్టం అవుతోంది. హఫీజ్ సయీద్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర ఉన్నప్పటికీ పాక్ ఇలాంట చర్యలకు దిగడంపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదంకు నిధులు సమకూర్చుతున్నారన్న ఆరోపణలపై ఈ ఏడాది మేలో పాకిస్తాన్ కౌంటర్ టెరరిజం శాఖ హహీజ్ సయీద్పై కేసు నమోదు చేసింది.
మరోసారి బట్టబయలైన పాక్ కుట్ర
ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. ఉగ్రవాదులకు అండగా నిలిచి భారత్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా పాక్ ప్రేరేపిస్తోందని వెల్లడించింది. ఒక అంతర్జాతీయ ఉగ్రవాదికి బ్యాంక్ యాక్సెస్ ఇస్తే కుటుంబ పోషణను పక్కన పెట్టి దాడులపైనే దృష్టి కేంద్రీకరిస్తారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింద. తాజా ఘటనతో మరోసారి పాకిస్తాన్ యవ్వారం బహిర్గతమైందని భారత్ మండిపడింది.