ఐఎస్తో లింక్: 27 మంది ఉగ్రవాదులు అరెస్టు (ఫోటో)
సింగపూర్: కార్మికుల ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న విదేశీయులను సింగపూర్ పోలీసు అధికారులు అరెస్టు చేశారు. 27 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశామని సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తమ అంతర్గిత భద్రతా విభాగం 2015 నవంబర్ 16 నుంచి 2015 డిసెంబర్ 1వ తేది వరకు ఈ 27 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశామని బుధవారం సింగపూర్ వెల్లడించింది. వీరంతా సింగపూర్ లో నిర్మాణ రంగంలో కార్మికులుగా పని చేస్తామని ఇక్కడికి వచ్చారని సింగపూర్ అధికారులు చెప్పారు.
అయితే కార్మికుల ముసుగులో వీరందరూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్), ఆల్ ఖైయిదా ఉగ్రవాదులతో సంబంధం పెట్టుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విచారణలో వెలుగు చూసిందని సింగపూర్ అధికారులు అంటున్నారు.
ఇప్పటికే 26 మందిని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించామని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి దేశం విడిచి అక్రమంగా పారిపోవడానికి ప్రయత్నించడంతో అరెస్టు చేశామని, అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడని అన్నారు.
జైలు శిక్ష పూర్తి అయిన తరువాత అతనిని బంగ్లాదేశ్ కు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఈ 27 మంది ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైయిదా ఉగ్రవాదుల ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ లోనే దాడులు చెయ్యాలని కుట్రపన్నినట్లు తమ విచారణలో వెలుగు చూసిందని సింగపూర్ అధికారులు తెలిపారు.