విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కరోనా పాజిటివ్: ఇరాన్లోనే అత్యధికం
న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని సుమారు 170 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2 లక్షల మందికిపైగా కొవిడ్-19 సోకి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
భారతదేశంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఇలావుంటే, విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా కరోనా బారినపడ్డారు. విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కరోనా సోకినట్లు భారత విదేశాంగశాఖ పార్లమెంటులో తాజాగా వెల్లడించింది. వీరిలో 255 మంది ఒక్క ఇరాన్లో చిక్కుకున్నవారు కాగా, 12 మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలు ఉన్నట్లు తెలిపింది.
హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కరు చొప్పున భారతీయులు కరోనా బారినపడినట్లు విదేశాఖ శాఖ వెల్లడించింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.
Recommended Video
ఇప్పటి వరకు మనదేశంలో 150 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 25 మంది విదేశాలకు చెందినవారే గమనార్హం. మనదేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇరాన్, ఇటలీ దేశాల్లోనే కరోనా మరణాలు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.