ఉత్తర కొరియాలో అణుపరీక్షలు: మళ్లీ భూకంపం ?
సియోల్: ఉత్తర కొరియాలో సోమవారం వేకువ జామున మళ్లీ భూకంపం సంభవించింది. ఉత్తర కొరియా వాయువ్య ప్రాంతంలోని సోంగ్లిమ్ పట్టణం సమీపంలో రెక్టర్ స్కేలు పై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు దక్షిణ కొరియా వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే భూకంపానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని చెప్పింది.
అణు పరిక్షలు నిర్వహించడం వలనే భూకంపం వచ్చిందని తాము కచ్చితంగా చెప్పలేమని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా అణుపరిక్షలు నిర్వహించే పుంగేరి ప్రాంతానికి భూకంప కేంద్రం దూరంగా ఉండటంతో మళ్లీ అణుపరిక్షలు జరిగాయి అని నిర్దారించలేమని వాతావరణ శాఖ తెలిపింది.
జనవరి 6వ తేదీన ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం జరిపిన సమయంలో రెక్టార్ స్కేలు పై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రపంచ దేశాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో సాధారణ స్థాయి భూకంపాలు మామూలే అని నిపుణులు అనేక సార్లు చెప్పారు.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా అణ్వాయుధ పరిక్షలతో దూకుడు మీదున్న నేపథ్యంలో దక్షిణ కొరియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. దక్షిణ కొరియాకు అనుకూలంగా ఉన్న దేశాలు సైతం ఈ భూకంపం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూకంపంపై ఉత్తర కొరియా ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చెయ్యలేదు.