ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనాలు... ముగ్గురు మృతి
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సులావేసి దీవుల్లో 6.2 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ముగ్గురు చనిపోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండోనేషియాలోని సులావేసి దీవి మజేన్కు నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
భూకంపంతో ఒక హోటల్, గవర్నరు కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం వల్ల వచ్చిన సునామీ వల్ల వేలాదిమంది మరణించిన సంగతి తెలిసిందే.
భూకంపంతో సునామీ వచ్చే అవకాశం లేదని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ 7 సెకన్లు మాత్రం భూమి భారీ శబ్దంతో కంపించిందని తెలిపారు. గురువారం రోజున ఇదే జిల్లాలో 5.9 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే.