ఆప్ఘాన్లో వరుస బాంబు పేలుళ్లు: ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించుకోలేదు.
అయితే తాలిబన్ల ప్రభుత్వానికి ఐసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా.. వారే ఈ దాడులకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్లోని తాలిబాన్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాలిబన్ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు. గాయపడిన సుమారు 20 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో చాలామంది ఆప్ఘాన్ పౌరులే ఉన్నారు.
ఆప్ఘాన్ బాలుర పాఠశాలలకు అనుమతి, అమ్మాయిల చదువు ప్రశ్నార్థకమే
తాలిబన్ల పాలనలో ఆప్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేకుండా పోతున్నాయి. ఇక మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మహిళలు కేవలం పిల్లలు కనేందుకే.. ప్రభుత్వంలో బాగస్వాములయ్యేందుకు కాదని ఇప్పటికే తాలిబన్ కీలక నేతలు తేల్చిచెప్పడం గమనార్హం. తాజాగా, బాలికలను కూడా విద్యకు దూరం చేసేలా తాలిబన్ల నిర్ణయాలుండటం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా, 6-12 తరగతుల అబ్బాయిలు శనివారం నుంచి పాఠశాలలకు హాజరు కావాలంటూ తాలిబన్ల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, పురుష ఉపాధ్యాయులు విద్యా సంస్థలకు వెళ్లాలని ఆదేశించింది. ఇక 6-12 తరగతుల అమ్మాయిల గురించి మాత్రం ప్రస్తావించలేదు. దీంతో వారి చదువు ప్రశ్నార్థంగా మారింది. అయితే, 1-5 తరగతుల విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లేందుకు తాలిబన్లు ఇప్పటికే అనుమతిచ్చిన విషయం తెలిసిందే. 1990ల్లో అధికారంలో ఉన్నప్పుడు అమ్మాయిలు పాఠశాలలకు వెళ్లకుండా, మహిళలు పనిచేయకుండా తాలిబన్లు నిషేదాజ్ఞలు విధించారు. ఇప్పుడు అలా ఉండదని తాలిబన్లు చెబుతున్నప్పటికీ.. అదేదారిలో నడుస్తుండటం గమనార్హం.
ఇది ఇలావుండగా, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆప్ఘనిస్థాన్ కు తాజాగా మరో షాక్ తగిలింది. ఆ దేశంతో తమ సంబంధాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ ప్రకటించింది. తాలిబన్ సర్కారును అధికారికంగా గుర్తించడంపై అంతర్జాతీయ సమాజంలో స్పష్టత వచ్చేవరకూ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని సంస్థ అధికార ప్రతినిధి జెర్రీ రైస్ తెలిపారు.
కాగా, ఆప్ఘనినిస్థాన్లో తాలిబన్లు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. ప్రజలు తిండి లేకి ఆకలి కేకలు పెడుతుంటే వారు మాత్రం విందు వినోదాల్లో తేలుతున్నారు. ప్రజలకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో అత్యంత నిర్ధయగా వ్యవహరిస్తున్నారు. షరియా చట్టాల పేరుతో మహిళల స్వేచ్ఛపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. గడపదాటితే కాళ్లు విరిచేస్తామని కాల్చిపారేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈక్రమంలో తాలిబన్లు మరో సంచనలనాత్మకమైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరునే మార్చిపారేశారు. గత 20 ఏళ్లుగా అఫ్గాన్ లో ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రిత్వ శాఖ భవనానికి 'ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన' శాఖ అని పేరుపెట్టారు. దీనికి అరబ్బీ, దరి భాషల్లో బోర్డులు కూడా పెట్టారు. తాలిబన్ల కేబినెట్లో మహిళకు స్థానం లేదని స్పష్టం చేశారు. అటువంటి తాలిబన్లు 1996-2001మధ్య అఫ్గాన్ ను పాలించిన క్రమంలో ఈ మంత్రిత్వ శాఖను మార్చేశారు. తిరిగి మరోసారి అఫ్గాన్ ను స్వాధీనం చేసుకుని తిరిగి అదే పద్ధతిని కొనసాగించారు. దీంట్లో భాగంగానే మహిళా మంత్రిత్వ శాఖ పేరును 'ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన' శాఖగా పేరు మార్చేశారు. కాగా, గత గురువారం నుంచి మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులను తాలిబన్లు భవనంలోకి రాకుండా అడ్డుకున్నట్లుగా సమాచారం. తమ హక్కుల కోసం కొందరు మహిళలు పోరాడుతున్నప్పటికీ.. తాలిబన్లు మాత్రం ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. మహిళల నిరసనలను కవర్ చేసిన జర్నలిస్టులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీంతో మీడియా కూడా తాలిబన్లకు భయపడిపోతోంది. దీంతో తాలిబన్ల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది.