భార్యాబిడ్డలను హతమార్చిన భర్తకు.. మూడు పర్యాయాలు జీవిత ఖైదు
కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను గదతో మోది అతి దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడైన వ్యక్తికి మంగళవారం కోర్టు మూడుసార్లు జీవిత ఖైదు శిక్ష అమలుపరచాలంటూ తీర్పునిచ్చింది.
జోహన్నెస్ బర్గ్: కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను గదతో మోది అతి దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడైన వ్యక్తికి మంగళవారం కోర్టు మూడుసార్లు జీవిత ఖైదు శిక్ష అమలుపరచాలంటూ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... భారత సంతతికి చెందిన మొగాంబెర్రీ రాజన్ కందసామి దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరానికి సమీపంలోని చాట్స్ వర్త్ ఇండియన్ టౌన్ షిప్ లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
ఇతడికి భార్య వెర్షతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. తన భార్య తనకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని పెళ్లిచేసుకోబోతోందన్న అనుమానంతో 2013 డిసెంబరు నెలలో రాజన్ కందసామి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
భార్య వెర్ష(41), కొడుకు మెగాంద్రన్(17), కూతురు మెలారిసా(18) లను దారుణంగా గద లాంటి వస్తువుతో మోది హతమార్చాడు. పోలీసులు వచ్చేసరికి.. 'అసలేం జరిగిందో తనకేం గుర్తులేదని, ఎవరో కొందరు దుండగులు తమ ఇంట్లోకి ప్రవేశించి తనకు మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారంటూ..' కట్టుకథ అల్లేశాడు.
అతడు మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతుండడంతో పోలీసులు కూడా తొలుత అతడు చెప్పింది నమ్మారు. కానీ రెండ్రోజుల అనంతరం 'తన భార్యాబిడ్డలను తానే పొట్టనబెట్టుకున్నానంటూ'.. నిజం కక్కేయడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తన భార్య తననుంచి విడాకులు అడిగిందనే కోపంతో తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతడు ఒప్పుకున్నాడు. కందసామికి మతిస్థిమితం లేనట్లుగా భావించిన పోలీసులు కొంతకాలంపాటు అతడికి మానసిక రోగుల ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించారు.
అక్కడి వైద్యులు అతడి మానసిక స్థితి సరిగ్గానే ఉందని తేల్చడంతో తిరిగి కోర్టులో హాజరుపరిచారు. రెండేళ్లపాటు సాగిన ఈ కేసు విచారణలో చివరికి కందసామినే దోషిగా కోర్టు తేల్చింది.
అతడు చేసిన ఘోరానికి గాను మరణశిక్ష విధించినా కూడా తక్కువే అని కోర్టు అభిప్రాయపడింది. చివరికి మంగళవారం నాడు శిక్షను ఖరారు చేసింది. అతడు మూడు పర్యాయాలు జీవితఖైదు అనుభవించాలని తీర్పులో పేర్కొంది.