ప్రియుడి కాల్చివేతపై ప్రియురాలు వీడియో: మళ్లీ కాల్పులు, ఒబామా సంచలనం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. పోలీసు చర్యలకు వ్యతిరేకంగా డల్లాస్లో చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. మరో పదిమంది గాయపడ్డారని తెలుస్తోంది.
మిన్నెసోటా, లూసియానాలో పోలీసులు ఇద్దరు నల్ల జాతీయులను కాల్చి చంపారు. దీనిని నిరసిస్తూ గురువారం నాడు వందలాది మంది నల్ల జాతీయులు ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్చ్ నిర్వహించారు.
రక్తమోడుతున్న ప్రియుడు.. వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేసింది
డల్లాస్లోని బెలో గార్డెన్ పార్క్ వద్ద గురువారం రాత్రి గం.8.30లకు కాల్పులు ప్రారంభమయ్యాయి. నిరసనకారుల గుంపులో నుంచి ఇద్దరు.. పోలీసుల పైన కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో నలుగురు పోలీసులు చనిపోగా, మరో పదిమంది గాయపడ్డారు. నిరసనకారులు కూడా ముగ్గురు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
ఇక, మిన్నెసోటాలో నల్ల జాతీయుడిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపిన విషయం తెలిసిందే. కారులో వెళ్తున్న ఫిలాండో కాసిల్ (32) అనే వ్యక్తి వద్ద తుపాకి ఉండటాన్ని చూసిన అధికారి అతని వైపు గన్ చూపించారు. కాసిల్ తన గన్ లైసెన్స్ చూపించేలోపే పోలీసు అధికారి అతనిని కాల్చి చంపాడు.
దీనిని ఫిలాండో కాసిల్ ప్రియురాలు డైమండ్ రెనాల్డ్స్ లైవ్ వీడియో తీసింది. ఈ వీడియోను సదరు ప్రియురాలు ఇంటర్నెట్లో పెట్టింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, అంతకుముందు లూసియానాలో కూడా ఇలాంటి ఘటనలోనే ఓ పోలీసు అధికారి స్టెర్లింగ్ అనే వ్యక్తిని కాల్చి చంపాడు.
కాల్పులపై ఒబామా
నల్ల జాతీయుల పైన కాల్పుల అంశంపై బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్ల జాతీయులపై పోలీసులు చేసిన కాల్పులు జాతి వివక్షలాగే కనిపిస్తోందన్నారు. నాటో సమావేశం కోసం పోలెండ్ చేరుకున్న ఒబామా మీడియాతో మాట్లాడారు.
ఇలాంటి క్రూరమైన ఘటనల వల్ల అమెరికన్లందరూ ఇబ్బందులకు గురవుతారన్నారు.అమెరికా క్రిమినల్ జస్టిస్ సిస్టం చూపుతున్న గణాంకాల్లో ఎక్కువ మంది నల్ల జాతీయులనే కాల్చడం లేదా అరెస్టు చేయడం లాంటి చర్యలు పోలీసులు చేశారన్నారు.
తెల్ల జాతీయులతో పోలిస్తే ముప్పై శాతానికి పైగా నల్లజాతీయులను పోలీసులు అడ్డగిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత మూడు అంతకంటే ఎక్కువసార్లు వారిని పరిశీలిస్తున్నారన్నారు. గత ఏడాది కాలంలో తెల్ల జాతీయుల కంటే రెండు రెట్లు ఎక్కవ మంది నల్ల జాతీయులను పోలీసులు కాల్చారన్నారు. రెండు రెట్లు అధికంగా నల్ల జాతీయులను అరెస్టు చేశారన్నారు.
సరైన పత్రాలను వెంట తెచ్చుకున్నా 75 శాతం కన్నా ఎక్కువ కేసులు నల్ల జాతీయుల పైనే నమోదయ్యాయని చెప్పారు. వీరిలో పది శాతం మందికి కూడా శిక్ష పడిందన్నారు. అదే తప్పు చేసిన తెల్ల జాతీయులకు ఎలాంటి శిక్ష లేకుండా వదిలేశారన్నారు. ఇవి వాస్తవాలని, కేవలం చర్మం రంగు నలుపుగా ుండటం వల్లే వారిపై వివక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశం సమస్య అన్నారు.