ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్
స్టాక్హోమ్: వివిధ రంగాల్లో పరిశోధనలకు ప్రతి ఏటా ప్రకటించే నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం నాడు ప్రారంభమైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్ ప్రకటించారు. అమెరికాకు చెందిన ముగ్గురికి ఈ నోబెల్ పురస్కారం ప్రకటించారు. జెఫ్రీ సి.హాల్, హైకెల్ రోస్ బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్కు ఈ నోబెల్ అవార్డు అందించనున్నట్టు నోబెల్ అవార్డుల కమిటీ ప్రకటించింది.
శరీరంలోని అణువులు మానవ జీవక్రియల, మానసిక ఉద్వేగాల మార్పులను ఏ విధంగా తమ అధీనంలో ఉంచుకుంటాయో వివరించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది.
మొక్కలు, జంతువులు, మనుషులు ప్రకృతిలో జరిగే మార్పులను తమలో ఎలా ఇముడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాయో వీరి పరిశోధనల్లో వివరించినట్టు స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన నోబెల్ అసెంబ్లీ ఒక ప్రకటనలో పేర్కొంది.
నోబెల్ అవార్డు కింద విజేతలకు 9 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (11 మిలియన్ డాలర్లు) అందిస్తామని ప్రకటించింది. ఏటా వైద్యరంగంలో పరిశోధనలను గాను తొలుత నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు.
సైన్సు, సాహిత్యం, శాంతికి పాటుపడిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త, వాణిజ్యవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1901లో ఈ అవార్డులను ప్రారంభించారు.