అద్భుతం: సుశ్రుతుడి టెక్నాలజీతో ఆఫ్గనిస్తాన్ మహిళకు కొత్త నాసిక!
ఢిల్లీ/కాబూల్: శస్త్ర చికిత్స పితామహునిగా పేరుగాంచిన సుశ్రుతుడు దాదాపు రెండున్నర వేలు, మూడు వేల ఏళ్ల క్రితం ఉపయోగించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ ఆప్గనిస్థాన్ మహిళ ముక్కును ఢిల్లీ వైద్యులు సరిచేశారు.
తూటాల ధాటికి ఆమె ముక్కు ఛిద్రమైంది. దానిని వైద్యులు నాటి పరిజ్ఞానంతో సరియేడం గమనార్హం. నాలుగేళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్లో తుపాకీ కాల్పులకు గురైంది ఓ మహిళ. ప్రాణాలతో బయటపడింది.
కానీ ముక్కు మాత్రం ఛిద్రమైంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడింది. భారత్లో సర్జరీ చేస్తారని తెలుసుకున్న ఆమె కుటుంబం ఢిల్లీలోని కేఏఎస్ మెడికల్ సెంటర్కు చికిత్స కోసం వచ్చింది. ఆమెకు ఆ మెడికల్ సెంటర్లో సుశ్రుత వైద్య విధానంలో విజయవంతంగా సర్జరీ చేశారు.
ఈ విషయాన్ని డాక్టర్ అజయ్ కశ్యప్ వెల్లడించారు. బుగ్గల లోపలి చర్మంతో నాసికా రంధ్రాలను పునఃసృష్టించినట్లు ఆయన తెలిపారు. చెవి, ముక్కుల పునర్నిర్మాణానికి సుశ్రుతుడు చెప్పిన పరిజ్ఞానం నేటికీ అనుసరణీయమని చెప్పారు.
నేటి ప్లాస్టిక్ సర్జరీ వంటి మోడర్న్ సర్జరీలకు సుశ్రుత పద్ధతుల్లో మూలాలు ఉన్నాయని చెప్పేందుకు గర్విస్తున్నామని డాక్టర్ కశ్యప్ తెలిపారు. ముక్కు, చెవి వంటి పునర్నిర్మాణాలకు ఈ రోజుకి కూడా ఉపయోగించుకునే టెక్నిక్స్ ఉన్నాయని చెప్పారు. నాటి టెక్నిక్స్ సమకాలీన వైద్య విధానాన్ని అనుసంధానించి చికిత్స చేయాలన్నారు.