పాక్ ఎన్నికలు: పోలింగ్ కేంద్రం వద్ద పేలుడు: 31 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. పోలీసుల వ్యాన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. క్వెట్టాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 31 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు పోలీసులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా ముష్కరుడిని పోలీసులు అడ్డుకున్న సమయంలో అతడు తనని తాను పేల్చేసుకున్నట్లు తెలిసింది. పేలుడు కారణంగా ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు భయంతో పరుగులు పెట్టారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Condemnable terrorist attack in Quetta by enemies of Pak seeking to disrupt our democratic process. Saddened by the loss of innocent lives. Pakistanis must defeat the terrorists' design by coming out in strength to cast their vote.
— Imran Khan (@ImranKhanPTI) July 25, 2018
పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్న బాంబు నిర్వీర్య బృందాలు నిశితంగా పరిశీలించి పేలని గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా, ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్న పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.