ఆత్మాహుతి దాడులు: 35 మంది దుర్మరణం
కాబుల్: కాబుల్ పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్ని ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సుమారు 250 మంది వరకు గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు అన్నారు.
కాబుల్ లో శుక్రవారం రెండు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. కాబుల్ లో శుక్రవారం పోలీసు రిక్రూట్ మెంట్ జరిగింది. సాయంత్రం రిక్రూట్ మెంట్ జరుగుతున్న సమయంలో అభ్యర్థుల వరుసలోకి ఒక ఉగ్రవాది ఒంటినిండా బాంబులు పెట్టుకుని వెళ్లాడు.
తరువాత మెయిన్ గేట్ దగ్గర వరుసలో నిలుచుకున్నాడు. పోలీసులు అతనిని గమనించకుండ వారి పనులలో వారు ఉన్నారు. అదే సమయంలో అతను తనని తాను పేల్చేసుకున్నాడు. ఆ సందర్బంలో సంఘటనా స్థలంలో 20 మంది దుర్మరణం చెందారు.
అనేక మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పోలీసు అధికారులు హడలిపోయారు. అదే విధంగా కాబుల్ లోని షా షహీద్ సైనిక స్థావరం దగ్గర ఒక ట్రక్కులో బాంబులు తీసుకు వెళ్లి పేల్చేశారు.
ఈ పేలుడులో 15 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. 100 మంది వరకు గాయపడ్డారు. గాయాలైన వారిలో ఎక్కువ మంది మార్చుల్ స్టోన్ కంపెనీ ఉద్యోగులు, మహిళలు, పిల్లలు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ దాడులకు పాల్పడింది ఎవరు అని కచ్చితంగా తెలియడం లేదని అధికారులు తెలిపారు.