మంటల్లో చిక్కుకున్న బస్సు: 35 మంది భక్తుల సజీవ దహనం
దుబాయ్: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో 35 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ విదేశీయులే. మక్కాను సందర్శించడానికి వివిధ దేశాల నుంచి వారందరూ మదీన ప్రావిన్స్ కు చేరుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
మృతులు ఏ దేశానికి చెందిన వారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అరబ్, ఆసియా దేశాలకు చెందిన వారై ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు.. హజ్, ఉమ్రా యాత్రలో భాగంగా మక్కాను సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు సౌదీ అరేబియాకు వెళ్తుంటారు. రెండు రోజుల కిందట మదీన ప్రావిన్స్ కు చేరుకున్న కొందరు విదేశీ భక్తులు..స్థానికంగా ఓ ప్రైవేటు బస్సును అద్దెకు తీసుకున్నారు. మక్కాకు బయలుదేరారు. మార్గమధ్యలో బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తోన్న మరో భారీ వాహనాన్ని ఢీ కొట్టింది.
ఫలితంగా- బస్సు డీజిల్ ట్యాంకు పేలిపోయింది. మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్ని కీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. తప్పించుకునే దారి లేకపోవడంతో 35 మంది సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. కొద్దిసేపటికి బస్సు సైతం పాక్షికంగా పేలిపోవడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక బలగాలను రప్పించారు.
#BREAKING | At least 30 pilgrims were killed and five injured in an accident between a bus and a car in #SaudiArabia pic.twitter.com/jQC43YEIWP
— Ahmed Jahaf احمد جحاف (@A7medJa7af) October 16, 2019
మృతదేహాలు గుర్తు పట్టనంతగా దహనమయ్యాయని పోలీసులు వెల్లడించారు. వారిని గుర్తించడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రమాద సమాచారాన్ని దాదాపు అన్ని రాయబార కార్యాలయాలకు అందజేశామని, అక్కడి నుంచి మరి కొంత సమాచారాన్ని సేకరించాల్సి ఉందని అన్నారు. స్థానికులు ఎవరూ లేరని నిర్ధారించినట్లు చెప్పారు. బస్సు ఆపరేటర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. డీజిల్ ట్యాంకు పేలిపోవడం వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు.