ఫిలిప్పీన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం: 37మంది మృతి
మనీలా: ఇప్పటికే తుఫానుతో అతలాకుతలమవుతున్న ఫిలిప్పీన్స్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్లోని దెవావో నగరంలో ఓ షాపింగ్ మాల్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ 37 మంది మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కాగా, షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమవడంతో వీరంతా బతికుండే అవకాశంలేదని ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ తెలిపారు. శనివారం ఉదయం భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడగా.. వీటిలో 37 మంది చిక్కుకుపోయారని పేర్కొన్నారు. బాధితుల్లో అమెరికాకు చెందిన ఓ కాల్ సెంటర్ సిబ్బందీ ఉన్నారని కథనాలు పేర్కొన్నాయి.
ఇది ఇలావుండగా, దక్షిణ ఫిలిప్పీన్స్లో తుఫాను దాటికి బలైనవారి సంఖ్య 200కు మించిపోయింది. గల్లంతైన వారి సంఖ్యా 160కి చేరింది. మిందానావో ద్వీపంలో టెంబిన్ తుపాను వల్ల నదులు ఉప్పొంగుతున్నాయని, కొండచరియలూ విరిగిపడుతున్నాయని పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లోని 40,000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించామని తెలిపారు.