ఖతార్ సంచలనం: 60 విమానాల్లో 4వేల ఆవులు, ఏడారిలో గడ్డి..
ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న ఆరోపణలతో గల్ఫ్ దేశాలు ఖతార్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్నాయి. దీంతో ఈ ధనిక దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి.
దోహా: ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న ఆరోపణలతో గల్ఫ్ దేశాలు ఖతార్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్నాయి. దీంతో ఈ ధనిక దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ తదితర దేశాలు ఖతార్ను పక్కన పెట్టాయి.
సౌదీ అరేబియా తన సరిహద్దును మూసేయడంతో నిత్యావసర రవాణా ఆగిపోయింది. దీంతో ఆ దేశంలో వాటికి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరాక్ వంటి వంటి కొన్ని దేశాలు ఆహార పదార్థాలు పంపిస్తూ సాయానికి ముందుకు వస్తున్నాయి.
దీర్ఘకాలంలో కష్టాల నుంచి బయటపడేందుకు..
అయితే, ఈ సాయంతో తాత్కాలిక ఇబ్బంది కొంత తగ్గినా, దీర్ఘకాలంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడేందుకు ఖతార్ నడుం బిగించింది. భవిష్యత్తు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాలు, పాల ఉత్పత్తుల కోసం నాలుగు వేల ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం 60 విమానాలను ఉపయోగించనుంది. నౌకల్లో వీటి రవాణాకు చాలా రోజులు పట్టే అవకాశం ఉండటంతో విమానాలు మేలని సంచలన నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న ఆవులతో ఈ నెలాఖరు నుంచే పాల ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది.
బిజినెస్మెన్..
ఖతార్కు చెందిన మౌతాజ్ అల్ ఖయ్యత్ తమ దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాడు. ఈయనే ఈ వీటిని విమానాల్లో తరలించాలని నిర్ణయించాడు. అల్ ఖయ్యత్ సంస్థ ఖతార్లోకెల్లా పెద్దదైన షాపింగ్మాల్ను నిర్మిస్తోంది. ఎడారిలోనూ పచ్చ గడ్డిమైదానాలను పెంచడం ద్వారా పశువుల దాణాకు కొరత లేకుండా చేస్తామని సంస్థ ప్రకటించింది. ఆవుల మేత కోసం ఎడారిలో పచ్చగడ్డి మైదానాలను పెంచడం ద్వారా వాటి ఆహారానికి కొరత లేకుండా చూడనున్నట్లు మౌతాజ్ అల్ ఖయ్యత్ అనే సంస్థ పేర్కొంది.
2022లో ఫుట్బాల్ క్రీడలు సవాల్
సెప్టెంబరు కల్లా దేశీయంగానే పాల దిగుబడిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆవుల రాకతో ఈ నెలాఖరు నుంచే పాల ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించారు. 2022లో ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫుట్బాల్ క్రీడలను ఖతార్లో నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇలాంటి సవాళ్లు ఎదురుకావడంతో వాటిని ఎదుర్కోవాలని ధీమాగా ఉన్నారు ఖతార్ వాసులు.
సంక్షోభం నుంచి త్వరితగతిన..
సౌదీ తన ఉత్పత్తులను రవాణా చేయడం నిలిపివేయడంతో టర్కీ, ఇరాన్లు ఖతార్కు ఆహార, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. సంక్షోభం నుంచి త్వరితంగా బయటపడుతున్నందుకు ఖతార్వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని ఖతార్ ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి.