NEW YORK: కాల్పుల కలకలం: నలుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్రూక్లిన్లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారని న్యూయార్క్ పోలీసులు తెలిపారు.
శనివారం ఉదయం 7గంటల ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయంటూ తమకు ఫోన్ కాల్ వచ్చిందని ఓ పోలీసు అధికారి చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే నలుగురు వ్యక్తులు మృతి చెంది ఉన్నారని తెలిపారు. మరో మహిళ, ఇద్దరు పురుషులు తీవ్ర గాయాలపాలయ్యారని చెప్పారు.
బ్రూక్లిన్ వీక్వెల్లి 74యుటికా ఎవెన్యూ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని సదరు పోలీసు అధికారి తెలిపారు. తాము వచ్చే వరకే ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని సదరు అధికారి తెలిపారు. కాగా, గాయపడిన ముగ్గుర్ని సమీపంలోని ఆస్పత్రి చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, గత కొంతకాలంగా అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అమాయకుల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. రక్షణ కోసం ఇచ్చే తుపాకులను కొందరు ఇలా సైకోల్లా కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు.